పాలమూరు, హైదరాబాద్ మధ్య కారిడార్: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మహబూబ్నగర్ మధ్య పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు హామీ ఇచ్చారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంగళవారం శాసనసభలో సమాధానమిస్తూ ఆయన ఆ హామీ ఇచ్చారు. నేడు లేదా రేపు నూతన పారిశ్రామిక విధానాన్ని సభకు సమర్పిస్తామని ఆయన చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ విధానాన్ని కూడా తీసుకుని వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ యువకులకు అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తామని, అవసరమైతే ప్రత్యేక కోటా కేటాయిస్తామని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ కింద పెద్ద యెత్తున రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి జిల్లాలో ఉపాధి అవకశాలు పెంచుతామని, ముడిసరుకుల లభ్యతను బట్టి అన్ని ప్రాంతాల్లో అందుకు అనుగుణమైన పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కొత్త ఏడాదికి 1000 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు.
విద్యుత్తు సమస్య పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. వరంగల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.
తమ పార్టీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఏమీ చేయలేదనే వ్యాఖ్యను కాంగ్రెసు సభ్యురాలు గీతారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తమ పార్టీ కృషి చేసిందని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానం ఎప్పటికి అమల్లోకి వస్తుందని ఆమె అడిగారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచిందని టిఆర్ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు ఆరోపించడం సమంజసం కాదని ఆయన అన్నారు.