మెట్రోరైలుకు మరో మూడు జాతీయ అవార్డులు
హైదరాబాద్: రాజధాని ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మరో మూడు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన 36వ ఆలిండియా పబ్లిక్ రిలేషన్స్ జాతీయ సదస్సులో ఈ అవార్డులు సొంతం చేసుకున్నట్లు ఎల్ అండ్ టి మెట్రోరైలు అధికారులు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.
మొదటి అవార్డును సొషల్ మీడియా ఫర్ పిఆర్ అండ్ బ్రాండింగ్లో, పిఆర్ ఇన్ సెక్షన్-హెచ్ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్ క్యాంపెయిన్ విభాగంలో ద్వితీయ అవార్డును సొంతం చేసుకోగా, మూడో అవార్డును బెస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రొగ్రాం విభాగం కింద దక్కించుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ అవార్డులను రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మెఘ్వాల్ చేతుల మీదుగా కార్పొరేట్ కమ్యూనికేషన్ బృందం ఎల్ అండ్ టి మెట్రోరైలుకు అందజేసినట్లు ప్రకటనలో తెలిపారు.
పిఆర్ఎస్ఐ జాతీయ అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల్లో నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ పూర్వ చైర్పర్సన్ వాహజత్ హబిబుల్లా, గోవా, కేంద్ర పాలిత ప్రాంతాల జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఎస్కె. చతుర్వేది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్, మోడీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ ప్రెసిడెంట్ డా. అజిత్ పాఠక్లు వ్యవహారించినట్లు తెలిపారు.
అతిధులుగా పాల్గొన్న వారిలో మాడభూషి శ్రీధర్, తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్, ఎన్ఇ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఏఎం. సింగ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్ ఉన్నారు. ఈ సందర్భంగా బ్రాండ్ అంబాసిడర్ క్యాంపెయిన్ ఫర్ ఛేంజ్ మేనేజ్మెంట్- కేస్ స్టడతీపై ప్రజెంటేషన్ను సంజయ్కపూర్ చేశారు.
మెట్రో మార్గంలో రెండుచోట్ల మార్పు
మెట్రోరైలు ఆలైన్మెంట్ మార్పు ప్రతిపాదనలను బుధవారం నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అసెంబ్లీకి ఎదురుగా, అలాగే సుల్తాన్బజార్ వద్ద రెండు చోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాల్సిందిగా ప్రస్తుతానికి ఎల్ అండ్ టి సంస్థకు ప్రభుత్వం సూచించింది. బుధవారం సచివాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమైన సిఎం కెసిఆర్, ఈమేరకు ప్రతిపాదనలు అందించారు.
ఈ రెండుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని నిర్మించడం వల్ల వారసత్వ కట్టడాలు దెబ్బతినడంతో పాటు వాటి ఆనవాళ్లు లేకుండా పోతాయని ముందు నుంచి ప్రభుత్వం వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చోట్లనే కాకుండా పాతబస్తీ నుంచే వెళ్లే మెట్రోరైలు మార్గాన్ని కూడా మార్చాలని ప్రభుత్వం గతంలో సూచించినప్పటికీ, తాజాగా ఎల్ అండ్ టికి అందజేసిన ప్రతిపాదనలలో పాతబస్తీకి సంబంధించి ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. అసెంబ్లీ, సుల్తాన్బజార్ వద్ద మెట్రోరైలు ఆలైన్మెంట్ మార్పునకు ప్రతిపక్ష పార్టీలన్నీ దాదాపు అంగీకరించాయి.