ఉద్యోగాల పేరుతో యువకులకు టోపీ: ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు
హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తానంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన ఓ మహిళా న్యాయవాదిని సౌత్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సౌత్ జోన్ అదనపు కమిషనర్ ఎన్.కోటిరెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పాతబస్తీలోని అమన్నగర్ సమీపంలోని రెయిన్బజార్లో నివాసముంటే జైనబ్ ఫాతిమా (34) వృత్తి రీత్యా న్యాయవాది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మిస్తూ ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 75వేల నుంచి రెండు లక్షలు వరకు వసూలు చేసేదని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో డబీర్పురాకు చెందిన బషీర్ ఉర్ రెహ్మాన్, అతని స్నేహితుడు షబ్బీర్ అలీ ఆమె మాటలు నమ్మి ఉద్యోగం కోసం డబ్బు చెల్లించారు. ఉద్యోగం ఇప్పించేందుకు ఆమె ఇచ్చిన గడువుకూడా పూర్తికావటంతో బాధితులిద్దరూ ఉద్యోగమైనా ఇప్పించాలని, లేనిపక్షంలో తమ డబ్బు తిరిగి చెల్లించాలని కోరారు.
దీంతో వారి ఆమె హైకోర్టు న్యాయమూర్తి కెఎన్ జ్వాల పేరుతో వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసి ఇచ్చారు. న్యాయమూర్తి పేరుతో ఫాతిమా ఇచ్చిన ఉత్తర్వులు నకిలీవని తేలడంతో తాము మోస పోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమాతో పాటు ఆమె భర్త సయ్యద్ ఇమ్రాన్ హుస్సేన్ జాఫ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఉత్తర్వులు తయారు చేసేందుకు వినియోగించిన సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఫాతిమా, ఆమె భర్తపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం స్థానిక మీర్చౌక్ పోలీసులకు అప్పగించారు.