ఆత్మహత్య: క్షేమంగా తిరుగొచ్చిన మహిళా ప్రొఫెసర్
హైదరాబాద్: తన తండ్రికి రెండు రోజుల క్రితం ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వెళ్లిన వ్యవసాయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన ఆచూకీ లభ్యమైంది. రెండు రోజుల క్రితం సూసైడ్ నోట్ పెట్టి ఇంటి నుంచి స్పందన అదృశ్యమైన విషయం తెలిసిందే.
స్పందనా భట్ కోసం పోలీసులు రెండు రోజులుగా గాలించారు. అనూహ్యంగా గత రాత్రి క్షేమంగా స్పందన ఇంటికి చేరింది. మహారాష్ట్ర వెళ్లి తిరిగి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్పందన అదృశ్యం వెనుక కారకులపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, స్పందన క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజుల క్రితం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సదరు మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఎప్పటిలాగే బుధవారం ఉదయం విశ్వవిద్యాలయానికి వచ్చిన సదరు మహిళ ప్రొఫెసర్.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
అంతేకాకుండా, ఆ డైరీ యూనివర్సిటీ లైబ్రరీలో ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో ఆందోళనకు గురైన వారు వెంటనే యూనివర్సిటీకి చేరుకున్నారు. ఆమె అక్కడ లేకపోవడంతో ఆమె కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కోసం ప్రయత్నించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతంలో ఆమె సెల్ సిగ్నల్స్ను పోలీసులు ట్రేస్ చేశారు.