పొట్టలో డ్రగ్స్ దాచుకున్న మహిళ మూసా వెనక శశికళ?
హైదరాబాద్: డ్రగ్స్ను కడుపులో దాచుకుని దుబాయ్ నుంచి వచ్చి అధికారులకు దొరికిన విదేశీ మహిళ మూసియా మూసా (32) వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు నార్కోటిక్స్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఆగస్టు 28వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ తనిఖీలో దొరికిపోయిన మూసియాను ఉస్మానియాకు తరలించిన అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించి, ఎనిమా ద్వారా రూ.కోటి విలువైన కొకైన్ ప్యాకెట్లను వెలికితీశారు. అప్పటి నుంచి ఆమె ఎవరు? ఆమె వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేశారు.
దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడినట్లు సమాచారం. మూసియా హైదరాబాద్ రావటం ఇది మొదటిసారి కాదని, గతంలో రెండుసార్లు ఇక్కడకు వచ్చినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మూడోసారి రూ. కోటి విలువైన కొకైన్తో రావటం వెనుక ముంబైకు చెందిన లేడీ స్మగ్లర్ శశికళ అండదండలున్నట్లు, ఈ వ్యవహారంలో ఆమె ప్రధాన సూత్రధారి అని తేలింది.
శశికళ ముంబైలో హెరాయిన్ స్మగ్లింగ్లో బడా డాన్. ఆమె ఏటా రూ.100 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తుందనే రికార్డు ఉంది. మూసా తన కడుపులో డ్రగ్స్ను తీసుకు వచ్చిన తర్వాత వాటిని వెలికితీసేందుకు అవసరమైన నిపుణులు ఇక్కడి స్మగ్లర్లు రెడీగా ఉన్నారని దర్యాప్తులో తేలింది.