మరో ప్రమాదం: ఇన్ఫోసిస్ ఉద్యోగినిని మింగిన ఔటర్
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా, శంషాబాద్ ఔటర్రింగ్రోడ్డుపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగిని రజీయా సుల్తానా మృతిచెందింది. డ్రైవర్కు తీవ్రగాయాలైయ్యాయి.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అరకిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మంగళవారంనాడు అరకిలో బంగారంను పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తుల నుంచి అధికారులు ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులనుకేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని, మరో లారీని డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు.