లేడీ టెక్కీ మృతిపై అనుమానాలు: నాలాలో శవం
హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. హైదరాబాదులోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజభవన్రోడ్లోని పోలో గెస్ట్హౌస్లో అనూష(29) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
సమాచారం అందుకున్న క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి పరారయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే హైదరాబాదు నగరంలోని శేరిలింగంపల్లిలో ప్రమాదవశాత్తు నాలాలో పడిన మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి నాలాల పడిన సమాచారం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సిబ్బంది పది గంటల పాటు శ్రమించి పాప మృతదేహాన్ని వెలికి తీశారు.
బంగారం పట్టివేత
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 400 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన తమిళనాడు వాసి ఫణిసెల్వ నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
యువకుడి మృతి
ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. పాముకాటుకు గురైన రాజేంద్రప్రసాద్ అనే యువకుడిని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు చికిత్స చేయకపోవడంతో అతడు మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందుకే రాజేంద్రప్రసాద్ చనిపోయాడని మృతుడి బంధువులు రాస్తారోకో చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.