కేసీఆర్పై లగడపాటి ప్రశంసల జల్లు, ఆంధ్రా భక్తులకు సౌకర్యాలు కల్పించండన్న కేసీఆర్
హైదరాబాద్: లగటిపాటి రాజగోపాల్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకొక ప్రత్యేకత ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. సమైక్య రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పిన అప్పటి ఎంపీల్లో ఒకరు.
అంతేకాదు ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి ఎంపీ కేసీఆర్, లగడపాటి రాజగోపాల్ల మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ప్రతిన పూని, చేసిన వాగ్దానం ప్రకారం రాజకీయ సన్యాసం స్వీకరించిన నేత రాజగోపాల్. ఏ నోటితోనైతే సీఎం కేసీఆర్ను విమర్శించారో ఈరోజు అదే నోటితో కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు.
గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా మంథనిలో రాజగోపాల్ కుటుంబ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల కోసం సీఎం కేసీఆర్ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
ఆంధ్రా భక్తులకు సౌకర్యాలు కల్పించండి: కేసీఆర్
గోదావరి మహా పుష్కరాల్లో భాగంగా పాల్గొనేందుకు భద్రాచలం, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆంధ్రా నుంచి భక్తులు వస్తున్నారని, వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఎండీ రమణారావును ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాట్లను పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, చీఫ్ విప్ ఈశ్వర్లతో ఫోన్లో మాట్లాడి ఘాట్ల వద్ద పరిస్థితి, భక్తుల రద్దీ గురించి ఆరా తీశారు.