కెసిఆర్ని పొగడొద్దు, దీనికి సమాధానం చెప్పు:లగడపాటికి కవిత షాక్
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్కు తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు షాకిచ్చారు! పుష్కరాల ఏర్పాట్ల విషయమై కెసిఆర్ పైన లగడపాటి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
దీనిపై కవిత స్పందించారు. లగడపాటి రాజగోపాల్ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ను పొగడటం మానేసి, అసలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో మొదట చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
రెండు రోజుల క్రితం లగడపాటి... కెసిఆర్ పైన ప్రశంసలు కురిపించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా మంథని, కాళేశ్వరంలలో కుటుంబ సమేతంగా పుష్కర స్నానమాచరించారు.
కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల కోసం సీఎం కేసీఆర్ చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనిపై కవిత పైవిధంగా స్పందించారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలలో భక్తుల కోసం తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన వైద్యారోగ్య, సమాచార శిబిరాలు విశేష సేవలందిస్తున్నాయి.
సుదూర ప్రాంతాల నుంచి పవిత్ర పుష్కర స్నానం కోసం వస్తున్న భక్తులు అనారోగ్యానికి గురికాకుండా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం, స్థానిక సమాచారాన్ని అందించడం, మంచినీటి వసతి కల్పించడం అనే మూడు కీలక అంశాలపై తెలంగాణ జాగృతి దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో పుష్కరాలు జరుగుతున్న ఐదు జిల్లాల్లోనూ సికింద్రాబాద్ సన్షైన్ హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. భక్తుల తాకిడి అత్యధికంగా ఉండే నిజామాబాద్ జిల్లా కందకుర్తి, ఆదిలాబాద్ జిల్లా బాసర, కరీంనగర్ జిల్లా ధర్మపురి, కాళేశ్వరంతోపాటు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతాలను ఎంచుకొని వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఈ నెల 14 నుంచి మంగళవారం సాయంత్రం వరకు 1.35 లక్షల మంది భక్తులు వైద్య సేవలు అందుకున్నారని జాగృతి నిర్వాహకులు తెలిపారు. ఘాట్ల వివరాలు తెలపడం, ఆహారం, ప్రయాణం, వసతి లాంటి వాటికి సంబంధించిన వివరాలను అందించారు.
భక్తులకు అసౌకర్యానికి గురికాకుండా, సాఫీగా వారు పుష్కర స్నానం ముగించుకొని, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఈ కేంద్రాలు దోహదపడ్డాయి. వీటితోపాటు పలు ప్రాంతాల్లో మినరల్ వాటర్ కేంద్రాలను కూడా నెలకొల్పారు. వరంగల్ జిల్లా మంగపేట వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ కేంద్రం భక్తులకు విశేష సేవలందిస్తున్నది.
పుష్కరాల్లో భక్తులకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థ సభ్యులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎమ్మెల్యే ఏ రమేశ్ అభినందించారు. జాగృతి ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.