తెలంగాణ చరిత్ర: సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల నుంచి తెలంగాణ ప్రాంత మేథావుల చరిత్రలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి ఆదివారం సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలంగాణ మేథావులను కించపరిచేలా ఉందని న్యాయవాదులు జనార్ధన్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్, రవికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీరు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అవమానించడమే అన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేసింది.
6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన చరిత్రలను తొలగించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠాలు, పాఠ్యాంశాల జాబితా ఒకటి విడుదల చేసింది.
ఎనిమిదో తరగతిలో ఉన్న నిజాం ఉద్యమ చరిత్ర, తొమ్మిదిలో తెలంగాణ మాండలికంలో ఉన్న పాఠాలు, ఉప వాచకంలోని కాపు రాజయ్య, మిద్దె రామారావుల చరిత్రలను తొలగించారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరుపొందిన సరోజినీనాయుడు రాసిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ పద్యానికి సైతం తొలగించారు.
19వ శతాబ్దం తొలిపాదంలో పాశ్చాత్య దేశాలను సైతం ముగ్ధులను చేసిన ఈ గీతం ఏపీకి కేవలం హైదరాబాద్ స్థానికంగా కనిపించింది. ఇక పదో తరగతి తెలుగులో ఉన్న హైదరాబాద్ నగరం వివరాలు, బసవేశ్వర చరిత్ర, సాంఘిక శాస్త్రంలో సింగరేణి కాలరీస్ గురించిన సమాచారం, ఖనిజాల వివరాలు తీసివేశారు.
బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు అనే పాఠంలో హైదరాబాద్ దొరల ప్రస్తావన ఉందంటూ దాన్ని తొలగించారు. తెలంగాణ ఉద్యమం గుర్తుకు తెస్తుందనేమో వలసపాలిత ప్రాంతాలలో విముక్తి ఉద్యమాలు అనే సార్వజనీన పాఠం కూడా తీసేశారు.
ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలో చిన్నప్పుడే అనే పాఠాన్ని ఏపీ స్థానికతకు సంబంధం లేదని కారణం చూపుతూ తొలిగించారు. 8వ తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. ఈ పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షల్లో అడగబోరని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు.