కేసీఆర్కు ఘన స్వాగతం: గులాబీమయంగా బేగంపేట, ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు సాగునీటి కష్టాలకు చెక్ పెట్టనున్న మూడు భారీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం చేసుకుని ఈరోజు హైదరాబాద్కు తిరిగి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్కు రెండు వేల మంది కళాకారులతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఘన స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే బేగంపేట చుట్టుపక్కల ప్రాంతాలు గులాబీమయంగా మారాయి.
కేసీఆర్కు స్వాగతం పలికేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి బేగంపేటకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. గులాబీదండుతో బేగంపేట మొత్తం గులాబీమయంగా మారింది.
ఎటు చూసినా నిలువెత్తు కేసీఆర్ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. మహరాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వివరాలను సీఎం కేసీఆర్ వెల్లడించనున్నారు. అనంతరం బేగంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికి సీఎం క్యాంపు ఆఫీస్ దాకా ర్యాలీగా తీసుకునివెళ్లాలని ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఈ ర్యాలీపై కేసీఆర్ అయిష్టత చూపడంతో బేగంపేట ఫ్లైఓవర్ దాకా ర్యాలీ చాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలివే:
* రెండు రాష్ర్టాల మధ్య జరిగిన ఒప్పంద పురోగతిపై ఆమోదం.
* అంతర్రాష్ట్ర బోర్డు వ్యవహారాలు, నియమావళి కోసం రూపొందించిన నిబంధనలకు ఆమోదం.
* అంతర్రాష్ట్ర బోర్డు సచివాలయం పురోగతిపై సమీక్ష.
* తమ్మిడిహట్టి బ్యారేజీ: స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం.
* మేడిగడ్డ బ్యారేజీ: స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు వంద మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం. డిజైన్ను 101 మీటర్ల ఎత్తులో రూపొందించినందున భవిష్యత్తులో మరో మీటరు ఎత్తు పెంచుకునే వెసులుబాటు. ఎత్తు పెంపును వాస్తవ ముంపును గుర్తించిన తర్వాత అంతర్రాష్ట్ర బోర్డు నిర్ణయంతో చేపట్టాల్సి ఉంటుంది.
* చనాక-కొరాట బ్యారేజీ: 213 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ, మహారాష్ట్ర 80ః20 దామాషా ప్రకారం భరించాలి. బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టడంతో ముందుకు పోవాల్సిందిగా అంతర్రాష్ట్ర బోర్డు అనుమతినిస్తుంది.
* పింపార్డ్-పర్సోడా బ్యారేజీ: లోయర్ పెనుగంగ ప్రాజెక్టులో భాగంగా డిగ్రాస్ వద్ద పింపార్డ్-పర్సోడా బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఎత్తుపై సమగ్ర సర్వే నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
* ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, డిజైన్లు, డ్రాయింగ్స్, ప్రాజెక్టు నివేదికలను రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకోవాలి.