తెలంగాణ వచ్చినా..: మోడీ, కేసీఆర్లను ఏకేసిన లెఫ్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రధాని నరేంద్ర మోడీ పైన లెఫ్ట్ పార్టీలు ఆదివారం నాడు ధ్వజమెత్తాయి. అదే సమయంలో తెలంగాణలోని పది లెఫ్ట్ పార్టీలు ఒక్కతాటిపైకి రావడంపై ఆనందం వ్యక్తం చేశాయి. ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. మోడీ తొమ్మిది నెలల పాలన కార్పోరేట్ శక్తులకు అనుకూలమన్నారు.
బడ్జెట్లో పేదలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్డినెన్సులు తెస్తూ విపక్షాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. పేరుకే మోడీ పాలన అని, వెనుక ఆరెస్సెస్ నడిపిస్తోందన్నారు. తమకు ఇదే సమయమని ఆరెస్సెస్ భావిస్తోందన్నారు. లవ్ జిహాద్ వంటి అంశాలతో మైనార్టీలను విడదీస్తోందన్నారు.
మైనార్టీలను విడదీసి దాడులు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చైనాను దూరం చేయడానికి అమెరికాతో భారత్ ఒప్పందాలు చేసుకుంటుందని మండిపడ్డారు. చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. అభిప్రాయ బేధాలు పక్కన పెట్టి ఒక్కతాటిపైకి రాకుంటే భవిష్యత్తు కష్టమన్నారు.
మనమంతా ఏకమైతే భవిష్యత్తు మనదే అన్నారు. సీపీఐ నుండి ఎలాంటి ఆటంకం రాకుండా తాము చూస్తామన్నారు. బూర్జువా పార్టీలకు చెక్ పెట్టాలన్నారు. తెలంగాణ వచ్చాక కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. వాస్తు పేరుతో ప్రజాధనం వృధా చేస్తూ.. సచివాలయం మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ ఎవరికీ అపాయింటుమెంట్ ఇచ్చేలా లేరన్నారు.