కాశ్మీర్ తర్వాత టార్గెట్ హైదరాబాద్: విముక్తి అంటూ యువతకు ఐఎస్ ఉగ్ర వల
హైదరాబాద్: ఇతర ఉగ్రవాద గ్రూపులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసేస్తోంది. సిరియా, ఇరాక్లలో ఇప్పటికే ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థ భావజాలాన్ని హైజాక్ చేసింది. ఇప్పుడు లష్కరే తొయిబాను కూడా హైజాక్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాగా, లష్కరే తొయిబా భారతదేశంలోని కాశ్మీర్, హైదరాబాద్ ప్రాంతాల్లో కొంత ప్రభావితం చూపిస్తోంది.
లష్కరే తొయిబా సుప్రీం కమాండర్ హఫీజ్ సయీద్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే.. కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేసిన తర్వాత, హైదరాబాద్లో నిజాం పాలన వస్తుందని 2006లో చెప్పాడు.
హైదరాబాద్లో ఉగ్రవాదం
గత కొంత కాలం నుంచి ఉగ్ర భావజాలం కలిగిన పలు గ్రూపులు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కాగా, హైదరాబాద్పై హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలపై పాతబస్తీలోని కొన్ని వీధుల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం.
80శాతం మంది హఫీజ్ సయీద్ వ్యాఖ్యలను తిరస్కరించగా, మరికొంత మంది అతని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించడం గుర్తించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ఉగ్ర గ్రూపులు నగరంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, సయీద్ తన భావాజాలాన్ని ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి) అధికారులు తెలిపారు. అయితే, లష్కరే తొయిబా చెప్పిన వ్యాఖ్యలకు ఇక్కడి కొంతమంది యువత సానుకూలంగా స్పందిస్తుండటం ఆందోళన కలిగించే ఆంశమని చెప్పారు.
గత పదేళ్లుగా కొన్ని ఉగ్ర గ్రూపులు ఇక్కడి యువతను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ గతంలో ఉగ్రవాదులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. మక్కా మసీదు, దిల్సుఖ్నగర్, సాయిబాబా టెంపుల్, లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో వేర్వేరు ఉగ్రవాద గ్రూపులు బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, ఇండియన్ ముజాహిదీన్, లష్కరే తొయిబా, ఇప్పుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ హైదరాబాద్పై దృష్టి సారిస్తోంది. తమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతోంది.
ఐఎస్ఐఎస్ ఆందోళన
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు హైదరాబాద్కు పలువురు యువకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చాలా మందికి పోలీసులు కాన్సెలింగ్ ఇచ్చి తిరిగి వారింటికి పంపిస్తున్నారు. అయినా వారి ఉగ్ర భావజాలాన్ని మార్చుకోకుండా తిరిగి ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.
అప్ఫా జబీన్, సల్మాన్ మొహియుద్దీన్, అబ్దుల్ బాసిత్, సయ్యద్ ఒమర్, మాజ్ హుస్సేన్ల విషయంలో పోలీసులకు ఈ విషయం రుజువైంది. దీంతో వారిని పోలీసులు విచారిస్తున్నారు. వారు తమ నగరాన్ని విముక్లి కల్పించాలనే ఉగ్ర భావజాలంతోనే ఉన్నారని పోలీసులు గుర్తించారు.
అఫ్ఫా జబీన్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో యువకులను చేర్చే పనిలో నిమగ్నైంది. చాలా మంది యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించేందుకు ఆమె ప్రోత్సహిస్తోందని పోలీసుల విచారణలో తేలింది.
భారత ప్రభుత్వం నుంచి హైదరాబాద్ను విముక్తి కల్పించేందుకే వారు పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడం ఆందోళన కలిగించే అంశం. విముక్తి కల్పించాలనే వాదాన్ని యువతలో కల్పించి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఐబి అధికారులు తెలిపారు. కొందరు యువత ఉగ్ర భావజాలానికి ఆకర్షితులై.. ఉగ్రవాదుల్లో చేరేందుకు సిద్ధమవడం ఆందోళన కలిగించే విషయంగా మారిందని చెప్పారు.