రేవంత్ తీరుతో కంగు తిన్న లోకేష్..! : పార్టీ కన్నా సొంత ఇమేజ్ పైనే ఫోకస్..
హైదరాబాద్ : పార్టీ ఆదేశాలు ఓవైపు.. ఆదేశాలను ఖాతరు చేయకుండా తన సొంత కార్యాచరణపైనే ఫోకస్ చేస్తున్నాడన్న ఆరోపణలు మరోవైపు.. తెలంగాణ టీడీపీలో రేవంత్ వ్యవహారం పార్టీని అధిష్టానాన్ని ధిక్కరించేదిగా తయారైందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ ఇమేజ్ తో సంబంధం లేకుండా.. జనంలో తన ప్రాబాల్యాన్ని పెంచుకునేందుకే రేవంత్ పాకులాడుతున్నారన్న వాదనలు జోరందుకుంటున్నాయి. రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ అధిష్టానం.. లోకేష్ ఆదేశాలను సైతం పక్కనబెట్టి తన సొంత కార్యచరణకే రేవంత్ మొగ్గు చూపడంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
దీనంతటికి కేంద్రబిందువుగా మారింది మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం రేవంత్ చేసిన దీక్ష. రేవంత్ దీక్ష చేయాలని నిర్ణయించుకున్న ఆ సందర్బంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్పు చార్జీలను పెంచాలని నిర్ణయించింది. దీంతో మల్లన్న సాగర్ దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసి, చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని టీటీడీపీ నేతలను ఆదేశించారు లోకేష్.
ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి కూడా తెలియజేసినా..! దీక్షను వాయిదా వేయడానికి ఇష్టపడని రేవంత్, పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా దీక్ష చేయడానికే మొగ్గు చూపారు. దీంతో పార్టీకి చెందిన మోత్కుపల్లి లాంటి సీనియర్లు, అధ్యక్షుడు ఎల్.రమణ కూడా రేవంత్ చేసిన దీక్షకు దూరంగానే ఉండిపోయారు. కాగా, తన నిర్ణయాన్ని బేఖాతరు చేయడం పట్ల లోకేష్ కూడా కంగు తిన్నట్టు తెలుస్తోంది.
దీనికి తోడు రేవంత్ చేసిన దీక్షలో ఎక్కడా పార్టీ అధినేత ప్రస్తావన లేకపోవడంతో పార్టీ తరుపున కాకుండా తన సొంత ఇమేజ్ కోసమే రేవంత్ దీక్షకు దిగాడని రమణ వర్గీయులు ఆరోపణలకు దిగారు. ఈ అంతర్గత విబేధాలన్ని ఇప్పుడు టీటీడీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నట్టుగా సమాచారం. పార్టీతో సంబంధం లేకుండా ఏకపక్ష పోకడలకు పాల్పడుతున్న రేవంత్ వ్యవహారం టీటీడీపీని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.