ఐటీ జాబ్ పోయిందా? అయితే మీకో గుడ్న్యూస్!
ఉద్యోగం కోల్పోయిన టెక్కీలకు ఓ శుభవార్త. ఐటీ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికోసం ‘సింప్లీ లెర్న్’ అనే ఆన్ లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్: ఉద్యోగం కోల్పోయిన టెక్కీలకు ఓ శుభవార్త. ఐటీ రంగంలో నెలకొన్న సంక్షోభం, అమెరికా వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో దేశీయంగా సాఫ్ట్ వేర్ నిపుణుల ఉద్యోగాలు ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే.
అయితే ఇలా ఐటీ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికోసం 'సింప్లీ లెర్న్' అనే ఆన్ లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం భారత ఐటీ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగాల కోత ఆరోపణలను పలుమార్లు తిరస్కరించినప్పటికీ, వివిధ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగులకు సహాయపడేందకు 'బౌన్స్ బ్యాక్' స్కాలర్ షిప్ లను అందిస్తోంది.
ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ నిపుణులకు సంబంధిత కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందించనుంది. తద్వారా తమని తాము రీ స్కిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది.
భారతీయ పౌరులకు మాత్రమే లభించే ఈ స్కాలర్ షిప్ లో ఆధునిక టెక్నాలజీలలో ఉచితంగా శిక్షణ ఇచ్చి, భవిష్యత్ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తారు. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ వంటి డొమైన్లలో ఉచితంగా శిక్షణ ఇస్తారు.
అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే నాటికి 60 రోజుల లోపు ఉద్యోగాన్ని కోల్పోయిన వారై ఉండాలి. బౌన్స్ బ్యాక్ స్కాలర్ షిప్ పరిధిలో రూ.8,999 నుండి రూ.20 వేల వరకు విలువైన కోర్సులను ఉచితంగా అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31కి ముందు దరఖాస్తు చేసుకోవాలి.
ఆటోమేషన్, ఆధునిక టెక్నాలజీ తదితర అంశాల కారణంగా సంస్థల వ్యాపారం, ఉద్యోగాల ఎంపిక వ్యూహాలను అనివార్యంగా మార్చుకోవాల్సి వస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఆదుకోవడమే తమ లక్ష్యమని సింప్లీ లెర్న్ సీఈవో కృష్ణకుమార్ తెలిపారు.