కెసిఆర్ది రాజకీయ ఉగ్రవాదం, వైసీపీకీ నష్టం: భట్టి సంచలనం, కోర్టు కెళ్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాడు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీరు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు నష్టం కలిగిస్తాయని చెప్పారు.
ఇటీవల పలువురు టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్న విషయం తెలిసిందే. దీనిపై మల్లు భట్టి పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఫిరాయింపులతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు.
తెలంగాణలో వైసిపి, టిడిపి కనుమరుగు కావడం ఖాయమని, చివరకు మిగిలేది టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా తెరాసలో చేరరని చెప్పారు. 2019లో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాము అయిదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతోందని, ఇది సరికాదన్నారు. తమను ఓటములు కుంగదీయలేవని చెప్పారు.
టిడిఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు
టిడిఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మాగంటి గోపినాథ్, సండ్ర వెంకట వీరయ్య, ఏ గాంధీలు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర రావు తెరాసలో చేరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
పార్టీ ఫిరాయించిన వారి పైన అనర్హత వేటు వేయడంలో స్పీకర్ కార్యాలయం ఆలస్యం చేస్తోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు, ఆలస్యంపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పార్టీల విలీనం అనేది కేంద్ర ఎన్నికల పరిధిలోని అంశమని, స్పీకర్ పరిధిలో లేని అంశమన్నారు.