కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం: భట్టి, ఎంపీ కవితపై శారద విసుర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గాంధీ జయంతిని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ఎన్ని రోజులైనా అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ చెప్తారని, కానీ అంతలోనే శాసనసభను వాయిదా వేసి పారిపోతారని ఎద్దేవా చేశారు.
గాంధీ జయంతి రోజుల గాంధీకి నివాళులర్పించిన తర్వాత ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీని ఏకమొత్తంలో చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై విపక్షాలన్నింటితో కలిసి ప్రభుత్వంపై పోరాడతామన్నారు.
రైతు రుణమాఫీని ఒకేసారి చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ తమ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని చెప్పారు.
బతుకమ్మ పండుగకు రూ.10 కోట్లు కేటాయించడం సరికాదు: నేరెళ్ల శారద
బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించడంపై కాంగ్రెస్ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొనే కార్యక్రమాలకే నిధులు ఇస్తున్నారని ఆమె విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు, ఆశావర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బతుకమ్మ పండుగకు రూ.10 కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు. గతేడాది కూడా ఈ పండుగకు ఇంతే మొత్తాన్ని కేటాయించారని, అప్పుడదంతా ఎంపీ కవిత కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారని ఆరోపించారు.
కాబట్టి ఈసారి కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కానీ, తెలంగాణ జాగృతి సంస్థ దత్తత తీసుకోవడం ఏమిటని శారద ప్రశ్నించారు.