కిషన్జీని చంపింది మమత ప్రభుత్వమే: దీదీ మేనల్లుడు
కోల్కతా: మావోయిస్టు నేత కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావును హతమార్చింది బెంగాల్ ప్రభుత్వమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీ అన్నారు. కిషన్జీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవాడనే విషయం తెలిసిందే. ఆ ప్రకటన ద్వారా అభిషేక్ బెనర్జీ కిషన్జీ హత్యపై మరోసారి వివాదానికి తెరలేపారు.
రాష్ట్ర భద్రతా సిబ్బంది, పారామిలటరీ దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో జరిపిన ఎదురుకాల్పుల్లో కిషన్జీ చనిపోయాడని ఆయన చెప్పారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని బెల్పహారీలో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు. వెస్ట్ మిడ్నాపూర్ ప్రాంతం హింసకు, హత్యలకు పేరుగాంచిందని, 2008 నుంచి ఇది విపరీతంగా పెరిగిందని అన్నారు.
కానీ తృణముల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క వ్యక్తి మృతితో అది ఆగిపోయిందని ఆయన అన్నారు. అతడే కిషన్జీ అని, మమత ప్రభుత్వం అతన్ని చంపడం ద్వారా గట్టి హెచ్చరికలను పంపిందని, ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయమని అన్నారు.
పథకం ప్రకారం కిషన్జీని చంపలేదని, ప్రత్యేకమైన పరిస్థితిలో అది జరిగిందని, తాను ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నానని, కిషన్జీ మరణం గురించి పోలీసులకు కూడా తెలియదని గతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తాము ఎవరిని కూడా చంపాలని అనుకోవడం లేదని, సామాన్యుడినైనా లేదా ప్రతిపక్ష నేతనైనా చంపాలనేది తమ ఉద్దేశం కాదని, అది జరిగిపోయిందని ఆమె అన్నారు.
24 నవంబర్, 2011న వెస్ట్ మిడ్నాపూర్లోని బురిసోల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ మరణించిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లోనే కిషన్జీ మరణించాడని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడి కామెంట్స్ కిషన్జీ హత్యను ధృవపరుస్తూ వివాదాలకు తెరలేపాయి.