అనుమానంతో భార్యను రాయితో కొట్టిచంపాడు: జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి
ఖమ్మం: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ దుర్మార్గుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన రాపోలు శ్రీను, కృష్ణవేణి (24) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
కాగా, శ్రీను తరచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తుండేవాడు. ఆగస్టు 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా భార్యను రాయితో బలంగా మోదటంతో ఆమె తలపై తీవ్ర గాయమైంది.
తీవ్ర రక్తస్రావం కావటంతో ఆందోళన చెందిన శ్రీను వెంటనే ఆమెను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు భార్యను వరంగల్ ఎంజీఎంకు తరలించాడు.
అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తరచూ తన కుమార్తెను అనుమానించేవాడని, అదే కారణంతో ఆమెను కొట్టి చంపాడని శ్రీనుపై కృష్ణవేణి తండ్రి సంపంగి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జలపాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
ఖమ్మం జిల్లా వాజేడు మండలం బొగతా జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లా హన్మకొండలోని ఎస్ఆర్ కళాశాలకు చెందిన నిఖిల్గా గుర్తించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన నిఖిల్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు.