పక్కింటి మహిళపై అత్యాచారయత్నం!, తిరగబడితే బలైపోయాడు..
శ్రీనివాస్ రెడ్డి దుశ్చర్యకు వెంటనే అప్రమత్తమైన సదరు యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో గ్రామస్తులంతా గుమిగూడి శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ది చేశారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోర్గాం గ్రామానికి చెందిన ఈగ శ్రీనివాస్ రెడ్డి(30) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇంటి పక్కనుండే ఓ మహిళపై అత్యాచారానికి యత్నించడంతో శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను మంగళవారం నాడు మృతి చెందాడు.
పోలీసుల కథనం ప్రకారం.. గత సోమవారం అర్థరాత్రి పీకలదాక తాగి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అతని భార్య సావిత్రి, కుమారుడు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో పక్కింటి వైపు వెళ్లిన అతను, ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తన తల్లితో కలిసి సదరు మహిళ ఆరు బయట నిద్రిస్తోంది.
శ్రీనివాస్ రెడ్డి దుశ్చర్యకు వెంటనే అప్రమత్తమైన సదరు యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో గ్రామస్తులంతా గుమిగూడి శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ది చేశారు. బాధితురాలి బావ రవి అతని స్నేహితులు కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు. తొలుత ఊరి గ్రామ పంచాయితీ ఆఫీస్ వద్ద అతన్ని కొట్టి, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అతను మృతి చెందాడు. నిజామాబాద్ ఏసీపీ డి. ఆనంద్ కుమార్, టౌన్ సీఐ ఏ.సుభాష్ చంద్రబోస్ ఎస్ఐ మధు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.