కాపలా వెళ్లిన వ్యక్తిని చంపి, గుంతలో పూడ్చేశారు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి, శవాన్ని గుంతలో పూడ్చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం కొత్రేపల్లి గ్రామంలో గురువారంనాడు చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కుమ్మరి తిరుమలయ్య (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన కొత్రేపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తన మొక్కజొన్న పంటకు కాపలాగా అదే గ్రామానికి చెందిన పరమేష్, సలీముద్దీన్లతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా ఫలితం కనిపించలేదు. అయితే, గురువారం ఉదయం పొలవం వద్ద కరెంట్ స్తంభం పాతడానికి తీసిన గొయ్యిలో తిరుమలయ్య మృతదేహానికి సంబంధించిన కొన్ని అవయవాలు కనిపించాయి. చెత్తాచెదారం, మట్టితో శవం కప్పి ఉంది.
శవాన్ని పోలీసులు బయటకు తీయించారు. ముఖంపై తీవ్రమైన గాయాలున్నాయి. ఒక చేయి, ఎడమ కాలు విరిగిపోయి ఉన్నాయి. ఘటనాస్థలంలో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. తాగిన మైకంలో గొడవ జరిగి తిరుమలయ్య హత్యకు దారి తీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి భార్య భాగ్యలక్ష్మి గతంలోనే మరణించింది. తిరుమలయ్యకు ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు మృతదేహానికి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. హతుడి తండ్రి కుమ్మరి జంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.