వివాహేతర సంబంధంతో పుట్టాడు: తండ్రి చేతిలో హతమయ్యాడు
నిజామాబాద్: ఓ వ్యక్తి తప్పు మీద తప్పు చేశాడు. ఓ మానసిక వికలాంగురాలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన వల్ల ఆమెకు జన్మించిన బాలుడిని హతమార్చాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం బొమ్మన్దేవ్పల్లికి చెందిన కూనీపూర్ సాయిలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది కిందట ఇంటి పక్కనే ఉండే మానసిక వికలాంగురాలిని సాయిలు లోబరుచుకున్నాడు. ఎవరికీ చెప్పవద్దని, చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
ఆమె కడుపునొప్పిగా ఉందనడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఖర్చుల నిమిత్తం, బాధితురాలి పోషణార్థం రూ.50 వేలు ఇవ్వాలని పెద్దమనుషులు రాజీ కుదర్చడంతో సాయిలు కుటుంబసభ్యులు అంగీకరించారు.
మూడు నెలల కిందట బాధితురాలికి కొడుకు పుట్టగా మహేందర్ అని పేరు పెట్టారు. ఒప్పందం ప్రకారం సాయిలు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆదివారం సాయిలు రూ.25 వేలు అందజేశాడు.
సోమవారం తెల్లవారుజామున మహేందర్ మృతి చెంది కనిపించాడు. గొంతు నులిమిన ఆనవాళ్లు కనిపించాయి. సాయిలుపై అనుమానంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిలును పోలీసులు విచారిస్తున్నారు.