టర్కీలో బ్యాన్ చేశారు: ఇక్కడ చెలామణి చేశాడు
టర్కీలో నిషేధించిన కరెన్సీని అమాయకులకు విక్రయించి మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఓ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ సెంట్రల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: టర్కీలో నిషేధించిన కరెన్సీని అమాయకులకు విక్రయించి మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఓ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ సెంట్రల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డీసీపీ లింబారెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు అందించారు.
గుంటూరు జిల్లాకు చెందిన ఎం శ్రీమన్నారాయణ ప్రసాద్ హైదరాబాద్ హబ్సిగూడలో నివాసం ఉంటున్నాడు. ఆయన గతంలో రైల్వే పోలీస్ ఫోర్స్లో ఎస్సైగా పనిచేశాడు. మూడేళ్ల కిందట ఏసీబీకి పట్టుబడడంతో సర్వీస్ నుంచి తొలగించారు. దీంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
దాంతో గుంటూరుకు చెందిన శేషు కలిసి తన వద్ద టర్కీ కరెన్సీ ఉన్నదని, దానిని మార్చి ఇస్తే భారీగా నగదు వస్తుందని ఆశపెట్టాడు. అలా చెప్పి 100 కరెన్సీ నోట్లను శ్రీమన్నారాయణ ప్రసాద్కు అందజేశాడు. ఒక్కో నోటు విలువ భారత కరెన్సీలో రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ కరెన్సీ చెల్లదని, టర్కీలో నిషేధించారనే విషయం ప్రసాద్ తెలుసుకున్నాడు. అయినా ఎవరైనా అమాయకులు దొరికితే కరెన్సీని విక్రయించి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చునని అనుకున్నాడు.
ఆ ప్రయత్నంలో శుక్రవారం సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని వైట్హౌస్ బార్ వద్ద టర్కీ కరెన్సీ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ప్రసాద్ నుంచి 100 టర్కీ కరెన్సీ నోట్లు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.