బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు: అల్లుడ్ని చంపేందుకు సుపారి ఇచ్చాడు
కూతుర్ని ఇచ్చి పెళ్ల చేశాడు. చివరకు అల్లుడ్ని చంపించడానికి ప్రయత్నించాడు. అల్లుడ్ని చంపేందుకు ఓ ముఠాకు మామనే స్వయంగా సుపారి ఇచ్చాడు.
హైదరాబాద్: కూతుర్ని ఇచ్చి పెళ్ల చేశాడు. చివరకు అల్లుడ్ని చంపించడానికి ప్రయత్నించాడు. అల్లుడ్ని చంపేందుకు ఓ ముఠాకు మామనే స్వయంగా సుపారి ఇచ్చాడు. కుటుంబ తగాదాల కారణంగా ఆయన ఈ పనిచేసినట్లు బయటపడిది.
అయితే, ఆ హత్యాప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. హత్యకు కుట్ర పన్నిన ఓ ముఠాను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న సుపారి గ్యాంగ్ను శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలకు చెందిన జి.శ్యాంసుందర్రెడ్డి చందానగర్లో ఉంటూ మియాపూర్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా శ్యాంసుందర్రెడ్డి భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ కేసు మియాపూర్లోని కూకట్పల్లి న్యాయస్థానంలో విచారణలో ఉంది. శ్యాంసుందర్రెడ్డిని హత్య చేసేందుకు అతని మామ వాసుదేవరరెడ్డి కుట్ర పన్నారు.
జూన్ మొదటివారంలో తనకు పరిచయం ఉన్న కూకట్పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి కొండల్రెడ్డి సహకారంతో పాతబస్తీ, బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాలకు చెందిన కిరాయి హంతకులతో హత్య చేసేందుకు వాసుదేవ రెడ్డి పథక రచన చేసాడు.
పాత నేరస్థులు, వివిద హత్యకేసుల్లో నిందితులుగా ఉన్న మజార్ఖాన్, ఆష్రఫ్, అంజాద్, నవీద్, అబ్దుల్ఖాదర్, వసీం, మహ్మద్తో ఒక్కొక్కరికి రూ.3లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. మొత్త 12 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సదరు ముఠా సభ్యులు ఇప్పటికే మూడు సార్లు శ్యాంసుందర్రెడ్డి ఇల్లు, పెట్రోల్ బంక్ వద్ద రెక్కీ నిర్వహించారు. న్యాయస్థానం వద్ద విచారణకు వచ్చిన సమయంలో హత్య చేయాలని భావించారు. కానీ వీలు కాలేదు.
శుక్రవారం హఫీజ్పేటలోని ఆయన నిర్వహించే పెట్రోల్బంక్ వద్దకు ఆటోలో వచ్చి మారణాయుధాలతో కాపు కాశారు. అయితే కథ అడ్డం తిరిగింది. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, మియాపూర్ పోలీసులు ఆకస్మిక దాడు చేసి పట్టుకున్నారు. కొండల్రెడ్డి, వాసుదేవ రెడ్డితోపాటు నేరస్థులను పోలీసులు అరెస్టు చేయగా మహ్మద్ అనే గ్యాంగ్ సభ్యుడు పరారీలో ఉన్నట్లు మియాపూర్ ఏసీపీ రవికుమార్, సీఐ హరిశ్ఛంద్రారెడ్డి తెలిపారు.