కారెక్కే వారి కోసం త్యాగం! పాతవారికి బెంబేలు, కేసీఆర్ సంకేతాలు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇతర పార్టీల నుండి భారీగా నేతలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవారి కోసం పాతవారు పదవులు త్యాగం చేయక తప్పదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కేసీఆర్ వైఖరి పైన పలువురు అసంతృప్తితో ఉన్నారని, సెంటిమెంట్ కారణంగా మాట్లాడలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేరికలో చాలా జరిగాయి.. జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలోకి వచ్చే సీనియర్లకు ఇచ్చిన హామీ మేరకు వారికి పదవులు ఇవ్వాలి.
దీని కోసం పాతవారికి పదవీ గండం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా పార్టీ నేతల వద్ద ప్రస్తావించారని అంటున్నారు.
గత ఏడాది కాలంగా పార్టీలోకి ఎందరో సీనియర్ నేతలు,క నాయకులు వచ్చారు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరిలకు కేసీఆర్ పెద్దపీట వేశారు. కేసీఆర్ తన కేబినెట్లో తెలంగాణ ద్రోహులకు చోటిచ్చారని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, తెలంగాణవాదులు నిత్యం మండిపడుతున్నారు.
ఇప్పుడు డీ శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు. ఆయన తర్వాత సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలంటే పాతవారికి మొండిచేయి చూపక తప్పదంటున్నారు.
తెలంగాణ కేబినెట్లో కొత్తగా చేరిన కడియం, తలసాని, తుమ్మలలకు కేసీఆర్ చోటిచ్చారు. ఇప్పుడు డీ శ్రీనివాస్ వంటి వారు కూడా వస్తున్నారు. మరికొందరు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రుల్లో కూడా పాతవారి పైన వేటు పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పలువురు మంత్రులు దీనిపై బెంబేలెత్తుతున్నారని వార్తలు వస్తున్నాయి. కొత్తగా చేరుతున్న వారి కోసం తెలంగాణ కేబినెట్లోని మంత్రులకు కొందరికి రాబోయే కాలంలో ఉద్వాసన తప్పదంటున్నారు. గ్రేటర్ ఎన్నికల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగవచ్చునని అంటున్నారు.
18కి మించవద్దు
నిరుడు జూన్ 2న కేసీఆర్ ప్రమాణం చేసినప్పుడు ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో 16న మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని శాసన సభ్యుల దామాషా ప్రకారం సీఎం సహా కేబినెట్ సంఖ్య 18కి మించవద్దు.
ఈ కారణంగానే ఈ ఏడాది జనవరిలో రాజయ్యను బర్తరఫ్ చేశారని, ఆయన స్థానంలో కడియం శ్రీహరిని తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొండా సురేఖలకు మంత్రిపదవులు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్గా ఉన్నారు. కొండా సురేఖకు కేబినెట్లో చోటు దక్కలేదు.