చంద్రబాబు రావొచ్చు, తలసాని రౌడీలా వద్దు: మర్రి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును హైదరాబాదులో తిరగనివ్వనని చెప్పే నైతిక హక్కు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేదని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం అన్నారు.
మర్రి బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తలసాని ఏ ఎండకు ఆ గొడుకు పడతారని విమర్శించారు. అధికారం కోసం పార్టీని వీడిన తలసాని రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన అధినేతనే హెచ్చరించడం ఏ రాజకీయ నీతో చెప్పాలన్నారు.
మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతూ సమస్యలను అడిగిన వారిని బెదిరించడమే పనిగా పెట్టుకున్న తలసాని తీరు నియోజక వర్గం ప్రజలు గమనిస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పని చేసిన చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉందని ప్రజాస్వామ్యంలో పదవుల్లో ఉన్న వ్యక్తులను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంటుందన్నారు. గౌరవ మంత్రి పదవిలో ఉన్న తలసాని వీధిరౌడీల వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు.
తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి సనత్నగర్కు ఏమి చేశాడని ప్రశ్నిస్తున్న మంత్రి తలసాని కళ్లు ఉండి కబోదిలా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు, సనత్నగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని హడావిడిగా కార్యక్రమాలు ప్రారంభిస్తూ అధికారులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు.