ఆంధ్రా హీరోయిన్లతో క్యాట్వాక్లు: కెటిఆర్పై మేడిపల్లి
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా హీరోయిన్లతో క్యాట్వాక్లు, ఆంధ్రా వాళ్లతో వ్యాపారాలు చేసుకునే కెటిఆర్కు వారిని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
హైదరాబాద్లో ఉన్న ఆంధ్రోళ్లందరూ తమ బిడ్డలేనని ప్రగల్భాలు పలికి, ఆంధ్రావాళ్ల మోచేతి నీళ్లు తాగొద్దని కేటిఆర్ సుద్దులు చెప్పడం మిలినీయం జోక్గా నిలిచిపోతుందని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం చంద్రబాబు ఒక మెట్టుదిగి రావడాన్ని వక్రీకరించి, కాళ్ల బేరానికి వచ్చారన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
హరీశ్ రావు మదంతో దొరంహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు పరాభవం ఖాయమని, గతంలో వరదారెడ్డికి పట్టిన గతే ఇప్పుడు ఇంజినీరింగ్ మాఫీయా డాన్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడుతుందని ధ్వజమెత్తారు.
తెలంగాణ టిడిపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుండటంతో దాన్ని టిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీశ్ రావుల పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. కృష్ణపట్నం, సీలేరు, హిందూజాలో అన్యాయం జరిగితే తామే పోరాడతామని చెప్పారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని వేయాలని అన్నారు.