కెసిఆర్కు సవాల్: వరంగల్ నుంచి మీరా కుమార్, ఢిల్లీకి ఉత్తమ్ అందుకే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ధీటైన సవాల్ విసిరే ఉద్దేశంతోనే కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో మాజీ స్పీకర్ మీరా కుమార్ను దింపడానికి అధిష్టానాన్ని ఒప్పించేందుకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
మీరా కుమార్ అభ్యర్థిత్వంపై అధిష్టానంతో చర్చించేందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీకి పయనమైనట్లు చెబుతున్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు రాజయ్య, వివేక్, సర్వే సత్యనారాయణతో పాటు పలువురు ఎస్సీ నేతలు వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వారి ప్రయత్నాలు అటు సాగుతుండగానే మీరా కుమార్ను నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. మీరా కుమార్ను పోటీకి దించడం ద్వారా రెండు ప్రయోజనాలు పొందే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కటి, కెసిఆర్కు సవాల్ విసరడం, రెండు - పార్టీలో విభేదాలు పొడసూపకుండా చేసుకోవడం.
ఎస్సీ సీనియర్ నాయకుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా విభేదాలు పొడసూపి, సహకారం లభించకపోవచ్చునని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మీరా కుమార్ను పోటీకి దించితే అందరూ సహకరించే అవకాశం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మీరా కుమార్ను ఓడించడం కెసిఆర్కు పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. జగజీవన్ రామ్పై అభిమానంతోనే కాకుండా మీరా కుమార్కు ఉన్న మంచి పేరు వల్ల ఓటర్లు కాంగ్రెసుకు ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు.
ఇదిలావుంటే, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెలలో తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ షెడ్యూలపై, రూట్ మ్యాప్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.