కెసిఆర్ వ్యూహానికి కాంగ్రెసు ప్రతివ్యూహం: వరంగల్లో మీరా కుమార్ పోటీ?
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎవరిని పోటీకి దింపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానంలో కెసిఆర్ ఎవరిని పోటీకి దింపాలని అనుకుంటున్నారనే విషయంపై రోజుకో వార్తాకథనం వస్తోంది. అయితే తాజాగా, కాంగ్రెసు వ్యూహంపై బలమైన ప్రచారం ముందుకు వచ్చింది. కెసిఆర్ వ్యూహాన్ని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెసు పకడ్బందీ ప్రతివ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
వరంగల్ లోక్సభ ఉపఎన్నికల బరిలో లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను దింపాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉంది. బాబూ జగజ్జీవన్రామ్ కూతురుగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరా కుమార్ ప్రధాన భూమికను పోషించారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆమోదించే సమయంలో లోక్సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఆ పరిస్థితుల్లో లోక్సభ తలుపులు వేసి, చానళ్ల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి మూజువాణి ఓటుతో విభజన బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో స్పీకర్గా మీరా కీలకపాత్ర పోషించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాదిగలు ఉండడం, వారందరికీ మీరా తండ్రి జగజ్జీవన్ రామ్ ఆరాధ్యుడు కావడం మీరాకుమార్కు కలిసివచ్చే అంశాలను వారు చెబుతున్నారు.
విభజన బిల్లు ఆమోదంలో కీలక భూమిక పోషించిన మీరా పట్ల కృతజ్ఞతను ప్రకటించాల్సిన ఆవశ్యకత పార్టీలన్నింటికీ ఉందని, అందువల్ల ఆమెపై పోటీకి మిగిలిన పార్టీలు దూరంగా ఉంటూ సంఘీభావాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.