తెలంగాణపై కేంద్రం చిన్నచూపు, నిండు కుండల్లా చెరువులు: మంత్రి హరీశ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పనులను సకాలంలో పూర్తి చేయడం వల్ల చెరువులు నిండు కుండల్లా మారాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలు చెరువులు వద్దకు వచ్చి చూస్తే బాగుంటుందని హితవు పలికారు.
మంగళవారం ఆయన మంత్రులు జోగు రామన్న, పద్మారావుతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల కళ్లు ఉండి కూడా చూడలేని పరిస్ధితిలో ఉన్నాయన్నారు. ఒకేరోజు అరవై చెరువు గట్ల మీద లక్ష మొక్కలను నాటడం అభినందనీయమన్నారు.
నర్సంపేట పట్టణం దుగ్గొండి చెరువు కట్టపై ఈత, తాటి మొక్కలను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల ఈత, తాటి మొక్కలను నాటుతామని వెల్లడించారు. నర్సంపేట పట్టణం రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ముగ్గురు మంత్రులను తీసుకొచ్చి మంచి కార్యక్రమం చేపట్టారని అభినందించారు.
ఇక నిధుల కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని హరీష్రావు విమర్శించారు. తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూపిస్తున్నా కేంద్ర వైఖరి రాష్ట్ర బీజేపీ నేతలకు కనిపించడంలేదా? అని నిలదీశారు. తెలంగాణ ద్రోహులపార్టీ తెలుగుదేశంతో బీజేపీ ఎలా కలుస్తుందని ప్రశ్నించారు.
అడవులు ఉన్నచోటే వర్షాలు: మంత్రి జోగు రామన్న
హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రజలంతా మొక్కలను నాటాలని మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. హరితహారం అనే కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అడవులు ఉన్నచోటే వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన ఆయన ప్రతీ ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.