సీఎం కేసీఆర్ సుదీర్ఘ చర్చ : ఎంసెట్2 రద్దు..
హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నా పత్రం లీకేజీ జరిగిన నేపథ్యంలో.. పరీక్ష రద్దుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఈరోజు రాత్రికి గానీ రేపు గానీ వెలువడే అవకాశం ఉంది. రద్దు చేయకపోతే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంసెట్ లీకేజీ వ్యవహారంతో.. పరీక్షను రద్దు చేయోద్దని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంసెట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సీఐడీ చీఫ్.. సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు.
ఎంసెట్ లీకేజీకి సంబంధించి పలు విషయాలను సీఎం కేసీఆర్ కు వెల్లడించిన మంత్రులు, అదికారులు తర్వాతి పరిమాణాలపై చర్చించారు. పరీక్షను రద్దు చేయడమా..! మరోసారి నిర్వహించమా..! అన్నదానిపై సీఎం కేసీఆర్ తో మంత్రులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లీకేజీ గురించి పలు విషయాలను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించిన సీఐడీ అధికారులు.. పేపర్ లీకేజీలో రెసెనెన్స్ అకాడమీ కీలక పాత్ర పోషించిందని తెలిపినట్లుగా సమాచారం.
రెసెనెన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్లు దిల్ సుఖ్ నగర్ తో పాటు, కర్నూలులోను ఉన్నట్లుగా అధికారులు వివరించారు. నిందితులపై తీసుకోవాల్సిన చర్యలు, ఎంసెట్ కు పలు కీలక విషయాలపై చర్చించారు.