మార్కెట్ యార్డు విధ్వంసం: ఫంక్షన్ హాల్లో స్కెచ్, రామోజీ ఈటీవీపై నిందలు
ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని నమస్తే తెలంగాణ పత్రిక ఆరోపించింది. రామోజీ ఈనాడుపై కూడా నిందలు వేసింది.
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ కుట్ర కథను అల్లి ప్రచురించింది.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యపై నిందలు మోపింది. జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ కూడా ప్రతిపక్షాలపైనే ఆరోపణలు చేశారు. మిర్చి మార్కెట్ యార్డులో మాత్రం సండ్ర వెంకట వీరయ్య కనిపించారు. తెలంగాణలో మిర్చిధరలు క్వింటాలుకు రూ. 3000లకు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నిరాశే ఎదురవుతోంది.
ఒకపక్క రైతులు పెద్దయెత్తున ఆందోళనలు మొదలు పెట్టారు. తాజాగా శుక్రవారంనాడు ఖమ్మం మార్కెట్యార్డులో రైతులు ఆందోళనలతో రెచ్చిపోయారు. నిరుటితో పోల్చితే సగానికి పైగా ధర తగ్గటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతోనే కేంద్ర సాయం కోసం లేఖరాసింది. మార్కెట్ ఇంటర్వెన్షన స్కీం(ఎంఐఎస్) ద్వారా మిర్చి రైతును ఆదుకోవాలని కేంద్రానికి మార్కెటింగ్శాఖ మంత్రి హరీశరావు లేఖ రాశారు.
కేంద్రం ఈ విషయంలోనూ పెద్దగా స్పందించ లేదు. అయితే ఎంఐఎస్ ద్వారా ముందు రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని, తద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టంలో భాగం పంచుకుంటామన్న సమాచారాన్ని కేంద్రం పంపించింది. కానీ గిట్టుబాటుధర రాకుండా నష్టాల పాలవుతున్న రైతులకు ఆదుకోవాలంటే వెంటనే వారికి మంచి ధర వచ్చేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఖమ్మం కలెక్టర్ వాదన ఇలా...
ఖమ్మం మిర్చి మార్కెట్లో కొందరు వ్యక్తులు రైతుల ముసుగులో విధ్వంసాన్ని సృష్టించారని ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకే్షకుమార్ అన్నారు. ముఖానికి కర్చీఫ్లు కట్టుకొని వచ్చి దాడులకు పాల్పడ్డారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చాకే అక్కడ పరిస్థితి చేయి దాటిందని ఆరోపించారు. ఈ దాడిలో కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్నామనిచెప్పారు. శుక్రవారం ఆయన మార్కెట్ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు.
తప్పుడు ప్రచారం చేశారని...
కొందరు కమీషన్ ఏజెంట్లు ముఖ్యంగా ఎంకే, సిద్ధార్థ, బబుల్, ఎన్-1, ఎన్ఎస్-2 వంటి పెద్ద కమీషన ఏజెన్సీలు సోమవారం నుంచి కొనుగోళ్లు ఉండవని తప్పుడు ప్రచారం చేశారని కలెక్టర్ అన్నారు. ధరలు ఇంకా పడిపోతాయని హెచ్చరించారని తెలిపారు. శుక్రవారమే సరుకు తేవాలని ప్రచారం చేశారని చెప్పారు. శుక్రవారం భారీ మొత్తంలో మిర్చి రాగా కమీషన ఏజెంట్లు ధరలను 2500-4500కు తగ్గించేశారని తెలిపారు. దాడి అంతా సీసీ కెమెరాల్లో నమోదైందని, నేరస్థుల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
తెరాస ప్రచారం ఇలా...
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుట్రలో భాగంగానే ఖమ్మం మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. దాడికి పాల్పడింది టీడీపీ కార్యకర్తలే అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతోమాట్లాడారు. రైతులను రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వరంగల్ సభ విజయవంతం కావటాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, నిధుల సేకరణపై రేవంత్ రెడ్డి ఆరోపణలు అబద్ధాలే సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు.
విపక్ష విధ్వంసం అంటూ..
విపక్ష విధ్వంసం అని శీర్షిక పెట్టి నమస్తే తెలంగాణ భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది. పక్కా ప్రణాళిక, అర్ధరాత్రి ఫంక్షన్హాలులో కుట్ర, తెల్లవారగానే గోశాలలో మంతనాలు, ఆ వెంటనే పుకార్ల సృష్టి, మార్కెట్యార్డుముందు టీడీపీ ఎమ్మెల్యే ధర్నా, చైర్మన్ పిలిచి చర్చలు జరుపుతుండగానే బయట విధ్వంసాలు, ముందే వచ్చి రెండున్నర గంటలు నాన్ స్టాప్ లైవ్ పెట్టిన ఈటీవీ, చర్చలు సఫలమవుతున్న దశలో అర్ధాంతరంగా జారుకున్న ఎమ్మెల్యే, ముఖాలకు దస్తీలు కట్టుకొని చైర్మన్ చాంబర్లో విధ్వంసానికి దిగిన అల్లరిమూక..అంతా స్క్రిప్టు ప్రకారమే విపక్షాలు, మీడియా కూడబలుక్కొని తీసిన సినిమా ఇది. దాని పేరు ఖమ్మం మార్కెట్ విధ్వంసం అని నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. ఆ వార్తాకథనం ఇలా సాగింది.
దాదాపు గంటన్నర పాటు విధ్వంసం...
దాదాపు గంటన్నరపాటు ఇష్టారాజ్యంగా మార్కెట్లో ఫర్నీచర్ను, వేయింగ్ మిషన్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇదంతా ముందే తెలుసా? అన్నట్టు లైవ్ కిట్తో అక్కడికి వచ్చిన ఈటీవీ ఈ మొత్తం ఎపిసోడ్ను రెండున్నర గంటలపాటు నాన్స్టాప్ లైవ్గా ప్రసారం చేసిందని నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. యార్డులో పోలీస్ బందోబస్తు ఉన్నా సంయమనం పాటించాలనే ఉద్దేశంతో అధికారుల ఆదేశంతో వాళ్లు బలప్రయోగానికి దిగలేదని రాసింది. విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోవడంతో పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన వివిధ జిల్లాల రైతులు భయాందోళనకు గురయ్యారని వ్యాఖ్యానించింది.
రైతులతో పాటు పరుగులు పెట్టారు...
రైతులతో పాటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు మార్కెట్ నుంచి బయటకు పరుగులు పెట్టారని, ఖమ్మం మార్కెట్ దాడికి పక్కా ప్లాన్తో కదిలినట్టు తెలుస్తున్నదని నమస్తే తెలంగాణ రాసింది. వరుసగా రెండు రోజులపాటు ఖమ్మం మార్కెట్కు సెలవు ఇచ్చారని, దీనితో శుక్రవారం పెద్ద సంఖ్యలో రైతులు వస్తారని ఊహించిన విపక్ష నాయకులు మార్కెట్పై దాడికి స్కెచ్ వేసినట్టు తెలిసిందని రాసింది.
ఫంక్షన్ హాల్లో ప్లాన్
గురువారం రాత్రి పదకొండున్నర గంటలకు కొందరు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాలులో ప్లాన్ వేసుకున్నట్లు తెలిసిందని, శుక్రవారం ఉదయం 8గంటలకు ఓ గోశాలలో మరోమారు సమావేశమైన తర్వాత పెద్ద సంఖ్యలో దుండగులు ఒక్కసారిగా మార్కెట్వైపు దూసుకొచ్చారని నమస్తే తెలంగా పత్రిక రాసింది. వాళ్లు వచ్చే ముందే తమకు అనుకూలమైన మీడియాకు సమాచారం అందించారని, ఈటీవీ ఛానల్ ఏకంగా లైవ్కిట్తో సహా దిగిందని ఆరోపించింది. మరికొంతమంది తమకు అనుకూలంగా ఉండే మీడియాను తీసుకెళ్లి రైతులు మార్కెట్యార్డులో ధ్వంసం చేస్తున్నట్లుగా చూపించమని పురమాయించారని ఆరోపించింది.
అందుకే అలా చేశారు..
మీడియా లైవ్ కవరేజీ వస్తే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కెట్లలో కూడా రైతులు ఆందోళన చేస్తారనేది విపక్ష నేతల అంచనా అని రాిసంది. ఈలోగా జేఏసీ నేతలతో సూర్యాపేట తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళన చేయించాలని పథకం రచించారని, ఒక్కసారిగా మీడియా అటెన్షన్కు వెళ్లాలన్నది వారి లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆరోపించింది.
ఇదీ ఆ లాజిక్...
విధ్వంసానికి పాల్పడ్డ వారు నిజంగా రైతులే అయితే ముఖాలకు ముసుగులు కట్టుకోవాల్సిన అవసరం లేదంటూ నమస్తే తెలంగాణ లాజిక్ లాగింది. అంతేకాకుండా వారు కనీసం మార్కెట్ ముందు కానీ, చైర్మన్ కార్యాలయం ముందు కానీ నిరసన ప్రదర్శన చేయడమో, వినతిపత్రం అందించడమో జరగాలని, అదేం జరుగలేదని వ్యాఖ్యానించింది. ముందే అనుకున్నారా? అన్నట్టు మూడు యార్డుల్లోని గేటు ఎంట్రీ కార్యాలయాలను ధ్వంసం చేసి, పత్తి యార్డులో ఏర్పాటు చేసిన జాతీయ వ్యవసాయ మార్కెట్ బిడ్డింగ్ కేంద్రంపై విరుచుకుపడ్డారని ఆరోపించింది.
ఇలా నిప్పు పెట్టారు...
మూడు యార్డుల్లో ఉన్న కమిషన్ వ్యాపారులకు సంబంధించిన పూర్తి కాంటాలను ఆందోళనకారులు ధ్వంసం చేసి నిప్పటించారు. కాటాలే టార్గెట్గా విధ్వంసం సృష్టించారని, ఈలలు కేకలు చప్పట్లతో ఈ విధ్వంసకాండ సాగిందని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. దాదాపు రెండు నెలలుగా నగర వ్యవసాయ మార్కెట్లో సాఫీగా క్రయవిక్రయాలు జరిగాయని, ఒకే రోజు రెండు లక్షల యాబై వేల మిర్చి బస్తాలు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పింది. ఒకరోజు కాంటాల ప్రక్రియకు ఆలస్యం జరిగినప్పటికీ మిగిలిన మార్కెట్లో కంటే కొంత మద్దతు ధర ఎక్కువగా వస్తుండటంతో రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదని చెప్పవచ్చునని రాసిది.
అందుకేనా ఇలా...
రాజకీయ పార్టీల పోటాపోటీ మార్కెట్ సందర్శనలు ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమాలకు రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకురావాలనే స్వార్థపు ఆలోచనే ఈ విధ్వంసానికి కారణమైందంటున్నారని నమస్తే తెలంగాణ రాసింది. విధ్వంసానికి ముందే ఖమ్మం మార్కెట్లో సోమవారం నుంచి మిర్చి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు పుకార్లు పుట్టించారని రాసింది. ఇది రైతుల్లో గందరగోళం సృష్టించిందని రాసింది.. అప్పటికే రెండు రోజులు సెలవు ఉండటంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో మిర్చి రైతులు మార్కెట్కు వచ్చారని చెప్పింది.
ఎమ్మెల్యే సండ్ర రాగానే...
కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఉదయం 8 గంటల సమయంలో దాదాపు 50 మంది రైతులు ధర విషయంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్తో చర్చలకు కూర్చున్నారని, ఉదయం10కు కొనుగోళ్లు ప్రశాంతంగానే ప్రారంభమయ్యాయని, క్వింటాల్ మిర్చికి రూ.6,300కు కొనే విషయంపై రైతులతో సయోధ్య కుదురుతున్న సమయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అక్కడికి చేరుకున్నారని నమస్తే తెలంగాణ రాసింది.
ఎమ్మెల్యేనూ పిలిచారు...
మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యేను కూడా లోపలికి పిలిచారని, ఈ సమయంలోనే బయట కొందరు విపక్ష నాయకులు వేయింగ్ కాంటాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం మొదలుపెట్టారని, మరికొందరు రాళ్లు రువ్వుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేశారని నమస్తే తెలంగాణ రాసింది. కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అక్కడి నుంచి జారుకున్నారని రాసింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన టీడీపీ మద్దతు దారులు ముఖానికి దస్తీలు కట్టుకుని చైర్మన్ రూంలోకి దూసుకువచ్చి ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేస్తూ విధ్వంసం సృష్టించారని పత్రిక ఆరోపించింది.
ఎమ్మెల్యే అనుచరులు ఇలా...
బయట ఉన్న ఎమ్మెల్యే అనుచరులు వేయింగ్ కాంటాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారని ఆ వెంటనే చైర్మన్ చాంబర్లో దూరి రాళ్లు కర్రలతో ఆస్తి ధ్వంసానికి పాల్పడ్డారని కలెక్టర్ తన నివేదికలో తెలిపారు. ఎమ్మెల్యే వీరయ్య చర్చల మధ్యనుంచే అర్థాంతరంగా వెళ్లిపోయారని చెప్పారు. ముందస్తుగా గురువారం రాత్రి 11-30 గంటలకు వేసుకున్న పథకం ప్రకారమే దాడి జరిగినట్టు ప్రభుత్వానికి నివేదిక అందిందని నమస్తే తెలంగాణ రాసింది.
రూ.2కోట్ల మేరకు నష్టం వాటిల్లింది..
శుక్రవారం నాటి విధ్వంసంలో సుమారు రూ.రెండు కోట్ల విలువైన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులు నష్టమైనట్లు ఖమ్మం మార్కెట్ కమిటీ అధికారులు తెలిపినట్లు నమస్తే తెలంగాణ రాసింది. మార్కెట్యార్డులో ఉన్న సీసీ టీవీల్లో ధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయని, వీటి ఆధారంగా స్థానిక పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఏసీపీ గణేశ్లు విచారణ చేపట్టారు. మార్కెట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారని రాసింది.