ఎమ్మెల్సీ ఎన్నికలు: తలసాని, వగైరాలకు టిడిపి విప్
హైదరాబాద్/ మహబూబ్నగర్ : తమ పార్టీ టికెట్పై గెలిచి సొంత గూటిని వీడిన శాసనసభ్యులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శనివారంనాడు విప్ జారీ చేసింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, తీగలకృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డిలకు విప్ జారీ చేసింది.
వారంతా శాసనసభ ఎన్నికల్లో టిడిపి టికెట్లపై గెలిచి అధికారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తలసాని శ్రీనివాస యాదవ్ ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని టిడిపి సభ్యులుగానే పరిగణిస్తూ ఓటర్ల జాబితా విడుదలైంది. ఈ స్థితిలో తెలంగాణ టిడిపి వారికి విప్ జారీ చేసింది.
ఇదిలావుంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. శనివారం ఉదయం ఆయన మహబూబ్నగర్లో మీడియా సమావేశంలో తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై కేసీఆర్ కక్షగట్టారని అందుకే వర్సిటీ భూములను అన్యాక్రాంతం చేసేందుకు సిద్ధమయ్యారని ఆయన దుయ్యబట్టారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు జరగడం లేదని, బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పని కల్పించేలా మిషన్ కాకతీయ వర్క్స్ జరుగుతున్నాయని వీరభద్రం విమర్శించారు.