అప్పుడు మంచు లక్ష్మికి పెళ్లి కావాలని మొక్కా, అయింది: మోహన్ బాబు
కరీంనగర్: కె చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్బాబు అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేయడంలో దివంగత ఎన్టీరామారావు తర్వాత ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమైనవారని ఆయన అన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన కేసీఆర్ ఇక్కడే పెళ్లి చేసుకున్నట్లు తనకు తెలిసిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ప్రధానమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గుడి అభివృద్ధికి 400 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. 13ఏళ్ల తర్వాత తాను మరోసారి శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చానని, అప్పుడు తన కుమార్తె లక్ష్మీప్రసన్న పెళ్లికావాలని మొక్కుకున్నానని తెలిపారు.
లక్ష్మీప్రసన్న వివాహంతోపాటు కుమారులు విష్ణువర్ధన్, మనోజ్ల పెళ్లిళ్లు కూడా అయ్యాయన్నారు. రాజన్న కరుణతో అంతా సంతోషంగా ఉన్నామని చెప్పారు.
ఎన్టీఆర్ తర్వాత కెసిఆరే..
అభివృద్ధిని కాంక్షి స్తూ, గొప్ప పనులు చేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ పుట్టిన ఊరిని, గతాన్ని మరచిపోకుండా ప్రజాహితమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో తెలుగు రాష్ర్టాల్లో నందమూరి తారకరామారావు తర్వాత గొప్ప నాయకుడు సీఎం కేసీఆరే అని మోహన్బాబు ప్రశంసించారు.
ప్రత్యేక పూజలు
24 ఫ్రేమ్స్పై నిర్మించనున్న సేనాపతి సినిమాకథతోపాటు మరో రెండు సినిమా కథలకు స్వామివారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అతిథిగృహంలో మీడియా సమావేశంలో ఎంపీ వినోద్కుమార్తో కలిసి మాట్లాడా రు.
కెసిఆర్ తీరు అభినందనీయం..
రాజన్న క్షేత్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడమే కాకుండా, ఏటా రూ.వందకోట్లతో అభివృద్ధి చేసేందుకు సంకల్పించడం అభినందనీయమని మోహన్ బాబు అన్నారు.
మరువలేనిది...
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, ఎంపీ వినోద్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, స్నేహం మరువలేనిదన్నారు. మోహన్బాబు సతీమణి నిర్మలాదేవి, చిన్న కుమారుడు, హీరో మనోజ్, ప్రణీతరెడ్డి దంపతులు, కూతురు మంచు లక్ష్మీప్రసన్న, ఆనంద్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.