పొట్టలో డ్రగ్స్తో మహిళ: ఎవరికో తెలియదట, ముంబైలో ఇలాగే...
హైదరాబాద్: కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను పొట్టలో దాచుకుని హైదరాబాదుకు చేరుకున్న దక్షిణాఫ్రికా మహిళ ముసాయి మూసాకు తాను ఎవరిని కలియాలనే విషయం తెలియదట. వాటిని ఎవరికి అందజేయాలనేది ఆమెకు కూడా తెలియకపోవడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదని అంటున్నారు.
ఇలాంటి సంఘటనే ముంబైలోనూ జరిగింది. దీంతో ముంబై పోలీసులతో కలిసి ఎన్సిబి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లాలని తనకు చెప్పారని, అక్కడ తమ మనుషులు సంప్రదించి శరీరంలోని డ్రగ్స్ను తీసుకుని తిరిగి పంపిస్తారని చెప్పారని మూసా విచారణలో వెల్లడించింది.
హైదరాబాదు వెళ్లాలని చెప్పారు గానీ ఇక్కడ ఎవరిని కలవాలనేది చెప్పలేదని మూసా అన్నట్లు సమాచారం. దీంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని అంటున్నారు. డ్రగ్స్ను కడుపులో దాచుకుని దుబాయ్ నుంచి వచ్చి అధికారులకు దొరికిన విదేశీ మహిళ మూసాయి మూసా (32) వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్లు నార్కోటిక్స్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఆగస్టు 28వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ తనిఖీలో దొరికిపోయిన మూసియాను ఉస్మానియాకు తరలించిన అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించి, ఎనిమా ద్వారా రూ.కోటి విలువైన కొకైన్ ప్యాకెట్లను వెలికితీశారు.