కబ్జా కుట్ర?: హైదరాబాద్ భూమిపై ఎంపి గీతకు విరుగుడు
హైదరాబాద్: హైదరాబాదులోని తన భూమిని లాగేసుకుంటున్నారని విశాఖపట్నం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు గీతకు ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి మండలంలలోని రాయదుర్గం పాన్ మక్తాలోని ముంబై హైవేకు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 83లోని 125.30 ఎకరల భూమికి సంబంధించిన వివాదంలో అరకు ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని, ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్, సభ్యులు జె. శ్రీనివాస్లు అన్నారు.
ఈ భూమిపై ఎంపి కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఎలాంటి హక్కులు లేవని స్ఫష్టం చేశారు. ఎంపి భర్త సొసైటీ పేరిట నకిలీపత్రాలు సృష్టించి భూమి కాజేసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. గీత భర్త ఎనిమిది కొత్త ప్రైవేటు లిమిటేడ్ సొసైటీలను సృష్టించి ఆ సొసైటీల్లో ఆయనే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2008-9లో 64 ఎకరాల భూమిని ఎనిమిది సొసైటీలకు బదిలీ అయినట్లుగా నకిలీపత్రాలు సృష్టించారని అన్నారు.
ఆ నకిలీ పత్రాలతో హైదరాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో ఈ భూమిని తాకట్టు పెట్టి రూ.42.72కోట్లు రుణంగా తీసుకున్నారని కూడా చెప్పారు. బ్యాంకు అధికారుల తనిఖీలలో ఆ పత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో సిఐడి పోలీసులు 468, 471, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు గుర్తు చేశారు. అదాయపుపన్ను శాఖ ఈ భూమిని విక్రయించేందుకు రూ. 42.79 కోట్ల ఒప్పందం చేసుకున్నందున పెట్టుబడి లాభాల కింద పన్ను చెల్లించాలని అసలు సొసైటీకి నోటీసు పంపిందని తెలిపారు.
నకిలీ పత్రాలతో గీత ఆమె భర్త భూమిని కాజేసేందుకు ప్రయత్నించినట్లు సొసైటీ ఆదాయపన్ను శాఖకు సమాధానమిచ్చిందని వారు తెలిపారు. ఈ కేసు ఆదాయపుపన్ను శాఖలో పెండింగ్లో ఉందని, భూమి యజమాని మహ్మద్ రుక్మొద్దీన్, పది మంది సభ్యులు శ్రీవెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ బి.శ్రీనివాస్ పేరిట జిపివో ఇచ్చారు.
ఆ తర్వాత వారి నుంచి ఒప్పందం పేరిట సొసైటీ భూమిని కొనుగోలు చేసిందని, నాటి నుంచి భూమి తమ ఆధీనంలోనే ఉందని వారు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని 621 మంది సభ్యులకు చెందిన ఈ స్థలాన్ని పరిరక్షించి, తమకు న్యాయం చేయాలని కోరారు.