తెలంగాణ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన అవాస్తవం: ఎంపి వినోద్
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడం అవాస్తవమని టిఆర్ఎస్ ఎంపి వినోద్ అన్నారు. లోక్సభలో శుక్రవారం రాజ్యాంగంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్ర విభజన జరిగిందన్నారు.
ఆర్టికల్-3 ప్రకారం విభజన సమయంలో రాష్ట్రాల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటారని పేర్కొన్నారు. రాజ్యాంగ సభలో ఉన్న వాళ్లంతా లాయర్లు, అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన ఉన్నవాళ్లేనని గుర్తు చేశారు.
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దదని న్నారు. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అణచివేతకు గురైందని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నోఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని ఈ సందర్భంగా వినోద్ లోక్సభలో చెప్పారు. ఆర్టికల్-131ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది ఇలా ఉండగా, జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి రాజ్యాంగానికే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగంపై నిర్వహించిన చర్చ సందర్భంగా లోక్సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పదం కాదని, భారతీయుల గౌరవానికి ప్రతీక, ఐక్యతకు నిదర్శనమన్నారు. రాజ్యాంగంపై చర్చించేందుకు సభ్యులందరూ ఆసక్తి ప్రదర్శించారన్నారు. ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.