హైద్రాబాద్ తో పాటు పలు విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం, హైజాక్ ముప్పు?
ఏకకాలంలో విమానాలకు హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైద్రాబాద్ తోపాటు ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్:ఏకకాలంలో విమానాలకు హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైద్రాబాద్ తోపాటు ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముంబై , హైద్రాబాద్, చెన్నై, విమానాశ్రయాల్లో ఏకకాలంలో విమానాలను హైజాక్ చేస్తామని ఆరుగురు చర్చించుకొంటుండగా ఓ మహిళన విన్నదంటూ ఈ మెయిల్ వచ్చింది.
ఇది బూటకపు ఈమెయిల్ అయ్యే అవకాశం ఉందని అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు తెలిపారు.
విమానం ఎక్కే సందర్భంలో భద్రతను ముమ్మరం చేశారు. అత్యవసర ప్రణాళికను అందుబాటులోకి తెచ్చి ఎయిర్ పోర్ట్ బాధ్యులందరితో చర్చించినట్టు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి సింగ్ మీడియాకు తెలిపారు.
ముంబై డీసీపికి ఈ మెయిల్ వచ్చిందన్నారు. దేశంలోని విమానాశ్రయాల భద్రతను సిఐఎస్ఎఫ్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపు ఈ మెయిల్ నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం నేపథ్యంలో విమానాశ్రయాల్లో జాగిలాల దళాలను రంగంలోకి దించారు.
సత్వర ప్రతిస్పందన బృందాలు కూడ అందుబాటులోకి ఉంచామన్నారు. విమానాయానసంస్థలను కూడ అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచినప్పటికీ ప్రయాణీకులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలుగని సాధారణ వాతావరణమే ఎయిర్ పోర్టులలో కొనసాగుతోందని ఓ సీనియర్ విమానాశ్రయ భద్రతాధికారి తెలిపారు.