కెటిఆర్కు షాక్: సిరిసిల్ల మహిళా కౌన్సిలర్ రాజీనామా, భర్త కూడా...
కరీంనగర్: హైదరాబాదు వరదలపై, అక్రమ కట్టడాల కూల్చివేతపై దృష్టి పెట్టిన మంత్రి కెటి రామారావుకు ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ సభ్యత్వానికి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి, ఆమె భర్త పద్మశాలి, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బూట్ల సుదర్శన్ రాజీనామా సమర్పించారు.
సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమంలో పాల్గొంటున్నారనే కారణంతో సుదర్శన్, రుక్కుంబాయి దంపతులపై ఇదే పార్టీకి చెందిన టిఆర్ఎస్ యూత్ విభాగం నేతలు దాడి జరిపి ఇంటిలో సామగ్రిని ధ్వంసం చేశారు. దీనిపై పద్మశాలీలు అత్యధికంగా ఉన్న సిరిసిల్లలో ఈ దాడి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ క్రమంలో పార్టీలో ఉంటూ జిల్లా ఉద్యమంలో పాల్గొనేవారు రాజీనామాలు చేసి పాల్గొనాలని పట్టణ తెరాస అధ్యక్షులు ప్రకటించారు. అయితే తమ కుటుంబంపై స్వంత పార్టీ శ్రేణులే దాడికి పూనుకోవడం, దీనిపై పార్టీ శ్రేణులు వారిపై ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడాన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ కౌన్సిలర్ రుక్కుంబాయి, సుదర్శన్ దంపతులు రాజీనామా చేశారు.
వారితో పాటు 27వ వార్డు తెరాస కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది మల్లికార్జున్, శివరాత్రి నటరాజ్తో పాటు వార్డు కమిటీ సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మరో 500 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సుదర్శన్ తెలిపారు. అలాగే త్వరలో కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయనున్నట్టు, ఇందుకోసం సమావేశం నిర్వహించి వేదికపై రాజీనామా చేస్తామని సుదర్శన్ వెల్లడించారు.
కాగా, జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న సుదర్శన్, రుక్కుంబాయి దంపతులు రాజీనామా ప్రకటన పట్ల ఉద్యమకారులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం, జెఎసి నాయకులు కత్తెర దేవదాస్, జక్కుల యాదగిరి, ఎండి.సత్తార్, బుస్స వేణు, న్యాయవాదులు మహేశ్గౌడ్ తదితరులు పూల మాలలు వేసి వారిని సత్కరించారు.