రాజకీయ దుష్ప్రచారంలో భాగమే: అమీర్ వ్యాఖ్యలపై మురళీధర్ రావు
ఖమ్మం: దేశంలో అసహనం పెరిగిపోతోందని, తన భార్య దేశం విడిచివెళ్తామని అడిగిందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుష్ప్రచారంలో భాగమేనని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ ఆరోపించారు. భద్రాచలంలో గోదావరి మహా హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఓ వార్తా ఛానల్తో మాట్లాడారు.
దేశంలో సెక్యూలరిజానికి వచ్చిన ముప్పేమీ లేదని.. సెక్యులరిజాన్ని అందరూ విశ్వసిస్తారని, అభిమానిస్తారని, అది ఎవరి సొత్తు కాదని మురళీధర్ చెప్పారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నో ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబడాసిడర్గా అమీర్ వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్థిరంగా పాలన సాగిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో అవినీతితో లబ్ధిపొందిన వ్యక్తులు, కొన్ని దుష్ట శక్తులు దేశంలో అస్థిరత్వం సృష్టించి ఇప్పుడు రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని మురళీధర్ విమర్శించారు. ప్రవాసాంధ్రులను, దేశంలోని పౌరులను ఐక్యం చేస్తూ దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసేలా కార్యక్రమాలు చేపడతుండగా లేనిపోని విషయాలపై ప్రతిపక్షాలు, ఇతర శక్తులు దుమారం రేపుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో అసహనం పెరుగుతోందంటున్న అమీర్ ఖాన్.. లక్షల మంది అభిమానులను ఏ విధంగా సంపాదిచుకోగలిగారని మురళీధర్ రావు ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయని, అందుకే ఓట్ల శాతం వచ్చినా సీట్లపరంగా ఓటమి పాలయ్యామని ఆయన చెప్పారు.
అన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఇలా ఏకమవడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి ప్రేమ చూపుతోందన్న టిఆర్ఎస్ నాయకుల విమర్శలపై స్పందిస్తూ... టిఆర్ఎస్కు ఒక్క తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని, కానీ బిజెపికి దేశంలోని అన్ని రాష్ట్రాలు ముఖ్యమైనవేనని స్పష్టం చేశారు.