దాడికి దిగాడని ని కక్ష: కిరాయి ముఠాతో హత్య
కరీంనగగర్: పది మంది లో తనపై దాడి చేయడంతో పరువు పోయిందని కక్ష పెంచుకున్న వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టి పోలీసులకు దొరికిపోయాడు. మాజీ నక్సలైట్ సాయంతో రూ.22 వేలకు ఒప్పందం చేయించుకుని యువకుడు జీవన్ను ఓ వ్యక్తి హత్య చేయించాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ మమత భర్త వెంకట్రెడ్డి అనుచరుడు దర్ర జీవన్ నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు.
పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని కామారెడ్డి గ్రామీణ సిఐ కోటేశ్వర రావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం విచారించింది. చివరకు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జీవన్ను చంపిన ముఠాను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన గుల్లపల్లి ఎల్లారెడ్డి, అక్కపల్లికి చెందిన యువకులు పోతుల గాంధీబాబు, దేవేందర్, సిద్ధిపేట వాసులు మల్లేశం, దేవేందర్లను సోమవారం అరెస్ట్ చేశామని సిఐ కోటేశ్వర్రావు చెప్పారు.
ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - ఎల్లారెడ్డిపేట సర్పంచ్ భర్త వెంకట్రెడ్డి అనుచరుడు జీవన్. మండల కేంద్రంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లిన వెంకట్రెడ్డిని అకారణంగా ఎల్లారెడ్డి దూషించాడు. దాంతో జీవన్ ఆయనపై దాడికి దిగాడు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి తన పరువుపోయిందని ఆ యువకుడిపై కసి పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని పథకం తయారు చేశాడు. అందుకు మాజీ నక్సలైటు గాంధీబాబును కలిశాడు. జీవన్ ప్రాణం తీస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. కొంత ముట్టజెప్పాడు. గాంధీబాబు అతని మిత్రులు దేవేందర్, మల్లేశం, దేవేందర్లకు విషయం చెప్పాడు. దాంతో ఓ ముఠాగా ఏర్పడి యువకుడు జీవన్ కదలికలపై కన్నేశారు. అతనితో స్నేహం చేయడం ప్రారంభించారు.
పథకం ప్రకారం జీవన్ను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. మద్యం తాగించి సదాశివనగర్ శివారులో దారుణంగా హత్య చేసి పారిపోయారు. మృతుడి సెల్ఫోను కాల్లిస్టు ఆధారంతో ముందుకు కదిలిన పోలీసులకు మొదట సిద్దిపేట వాసులు చిక్కారు. అనంతరం అక్కపల్లికి చెందిన గాంధీబాబు, దేవేందర్లను పట్టుకున్నారు. వారిని విచారించగా జీవన్ను చంపితే ఎల్లారెడ్డి డబ్బులు ఇస్తానని చెప్పినట్లు అంగీకరించారు. ఎల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తనపై దాడి చేయడం వల్ల పరువుపోయిందనే నెపంతోనే చంపించానని ఒప్పుకున్నాడు.