వీడిన హత్య మిస్టరీ: ప్రియుడితో కలిసి లక్ష్మీతులసిని చంపిన మహిళ
హైదరాబాద్: హైదరాబాదులోని లంగర్హౌస్లో ఏడాది కిందట జరిగిన వృద్ధురాలు లక్ష్మీతులసి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వృద్ధురాలితో పరిచయం పెంచుకొని, ఆమెతో చనువుగా ఉన్న మహిళ, తన ప్రియుడితో కలిసి హత్యకు పూనుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
లంగర్హౌస్ ఓంనగర్లో నివాసం ఉండే లక్ష్మీతులసి నిరుడు అక్టోబరు 15న ఇంట్లో హత్యకు గురైంది. సుమారు 60 తులాల బంగారు ఆభరణాలను చోరీకి గురయ్యాయి. పథకం ప్రకారం ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్య చేసిన పలు ఘటనలు గతంలో నగరంలో జరిగాయి. అయితే ఆ కోణంలో దర్యాప్తు చేసినా పోలీసులకు తగిన ఆధారాలు లభ్యం కాలేదు. అయితే స్థానికుల సమాచారంతో పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు.
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆ ప్రాంతంలో తచ్చాడారనే స్థానికులు సమాచారం అందించారు. దీంతో తెలిసిన వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే పోలీసులకు తగిన ఆధారాలు లభ్యం కాలేదు. స్థానిక పోలీసులు, సీసీఎస్, టాస్క్ ఫోర్సు బృందాలు ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించే పనిలో పడ్డాయి.
జంట కమిషనరేట్లలో 150 మందికిపైగా పాత నేరస్తులను విచారించినా లాభం లేకపోయింది. మిస్టరీగా మారిన ఈ కేసును సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ బృందాలు ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి దర్యాప్తు చేశారు.
స్థానికుల సమాచారం మేరకు లక్ష్మీతులసితో సన్నిహితంగా మెలిగినవారి గురించి పోలీసులు ఆరా తీశారు. కరీంనగర్కు చెందిన ఓ మహిళ ఆమెతో స్నేహంగా ఉండేదని తేలింది. ఆమె ఎవరు, ఆమెతో ఉన్నవారెవరు ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలను సేకరించిన పోలీసుల ఆమె ఆచూకీని కనిపెట్టారు. లక్ష్మితులసితో స్నేహంగా ఉన్న ఆ మహిళకు, ప్రియుడు కూడా ఉన్నాడు.
పదవీవిరమణ చేసిన వృద్ధ దంపతుల వద్ద భారీగా ఆభరణాలు ఉండడంతో వాటిపై కన్నేశారు. లక్ష్మీతులసితో స్నేహం చేస్తూ ఆమెకు తోడునీడగా ఉంటూ నిరుడు అక్టోబర్ 15వ తేదీన లక్ష్మితులసి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో వారి పథకాన్ని అమలు చేశారు. ఆమెను హత్య చేసి బంగారంతో ఉడాయించారు.