పిల్లలు వైజాగ్లో చదువుతున్నారు, అందుకే తెలియదు: సండ్ర కొత్త పాట
హైదరాబాద్: తన పిల్లలు విశాఖపట్నంలో చదువుతున్నారని, వాళ్లను చూసేందుకు తాను అక్కడికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యలో రాజమండ్రిలో చికిత్స పొందానని ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.
తాను సత్తుపల్లి శాసనసభ్యుడిని కాబట్టి అక్కడే ఉన్నానని, అందుకే హైదరాబాదులోని క్వార్టర్స్ వద్ద ఎసిబి నోటీసులు అందించిన విషయం తెలియదని ఆయన చెప్పారు. మీడియా ద్వారా ఆ విషయం తనకు తెలియడంతో ఎసిబికి రాసినట్లు తెలిపారు. అయితే, ఆ తర్వాత ఎసిబి నుంచి ఏ విధమైన స్పందన రాలేదని చెప్పారు.
తర్వాత తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని రెండోసారి ఎసిబికి లేఖ రాసినట్లు తెలిపారు. రెండో సారి నోటీసు ఇచ్చిన సమయానికి తాను విచారణకు హాజరయ్యానని ఆయన చెప్పారు. సోమవారంనాడు 8 గంటల పాటు ఎసిబి అధికారులు సాగించిన విచారణలో అన్ని విషయాలు చెప్పినట్లు ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
ఈ కేసులో తనను కుట్రపూరితంగా ఇరకించారని, అయితే తాను ఈ కుట్రలకు భయపడడం లేదని చెప్పారు. టిఆర్ఎస్కు 63 మంది మాత్రమే ఎమ్మెల్యేలుండగా, వాళ్లు 84 మంది ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. సరైన బలం లేని టిఆర్ఎస్ అసలు ఎన్నికల బరిలోకి ఎలా దిగిందని ఆయన అడిగారు. తాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని అన్నారు.