డ్రగ్స్ బానిసే! కానీ అమాయకుడు, పెద్దలను వదిలేశారు: కెల్విన్ తండ్రి ఆరోపణ
హైదరాబాద్: తన కుమారుడు అమాయకుడని డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తండ్రి జవహర్ బెర్నార్డ్ అన్నారు. కెల్విన్ డ్రగ్స్కు బానిసైన విషయం వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే, ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో కెల్విన్కు డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిందితులు బయటకు వస్తారని అన్నారు.
డ్రగ్ మాఫియాపై సర్కారు సీరియస్: సిట్ ఏర్పాటు, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ..
శనివారం డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ను సిట్ అధికారులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు కెల్విన్ను అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 14మంది అరెస్ట్
డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 14మందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1గా కెల్విన్ ఉన్నాడు. అబ్దుల్ కుదుస్, అబ్దుల్ వాయిద్, అమెన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుధ్, సంతోష్, దీప్, మహ్మద్ జీ అలీఖాన్, బెర్లాండ్ విల్సన్, అనిష్, రీతుల్ అగర్వాల్, పీయూష్లు ఉన్నారు. తాజగా శనివారం మరో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 14కు చేరుకుంది.
బీజేవైఎం ఆందోళన
డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలను తప్పించారని భారతీయ జనతా యువమొర్చా(బీజేవైఎం) ఆరోపించింది. ఈమేరకు నగరంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బీజేవైఎం నేతలు శనివారం ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్ కేసులో పలువురు పెద్ద హీరోలు కూడా ఉన్నారని పలువురు నేతలు ఆరోపించారు. అయితే వారిని తప్పించారని అన్నారు. అసలు నిందితులను అరెస్ట్ చేసేవరకు పోరాటం కొనసాగుతుందని బీజేవైఎం నేతలు పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.