ఫ్రెండ్ భార్యపై కన్నేసి: అక్కడ పచ్చబొట్టుతో!, లొంగదీసుకోవడానికే 'హత్య'
హత్య చేసి.. ఆపై ఏమి ఎరగనట్లు బాలుడి తల్లిదండ్రులతో కలిసి అతని కోసం వెతికినట్లు నటించాడు మధు.
వరంగల్: క్రిస్టియన్ కాలనీలో ఈ నెల 20న అదృశ్యమై.. మరునాడు శవమై తేలిన వినయ్ అనే బాలుడి మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలుడి తండ్రికి స్నేహితుడైన మధు అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసి.. ఆపై ఏమి ఎరగనట్లు బాలుడి తల్లిదండ్రులతో కలిసి అతని కోసం వెతికినట్లు నటించాడు మధు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆటో డ్రైవర్ కడారి రాజేష్ అతని భార్య రాధిక, కుమారుడు వినయ్ లతో కలిసి క్రిస్టియన్ కాలనీలో ఉంటున్నాడు. అబ్బనికుంటకు చెందిన కారు డ్రైవర్ మధుతో రాజేశ్ కు కొంతకాలంగా పరిచయం ఉంది. రాజేశ్ తో కలిసి మధు అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అతను రాధికపై కన్నేశాడు.
చేతిపై పచ్చబొట్టు
రాధికను లోబర్చుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. చేతిపై 'ఆర్'అని పచ్చబొట్టు పొడిపించుకుని మరీ ప్రేమించాల్సిందిగా ఆమెను వేధించసాగాడు. ఆమె ఎంతకీ లొంగకపోవడంతో.. వారి కుమారుడైన వినయ్ ను హత్య చేసి దాన్ని రాజేశ్ మీదకు నెట్టేసి జైలుకు పంపించాలనుకున్నాడు. అతను జైలు పాలైతే రాధికను సొంతం చేసుకోవచ్చని భావించాడు.
Recommended Video
ఆటోలో శవం
ఇదే క్రమంలో.. ఈనెల 19న వరంగల్ ప్రాంతలోని గాంధీనగర్కు చెందిన మూడో తరగతి చదువుతున్న వినయ్ (8) స్కూల్కు వెళ్లి ఇంటికి రాలేదు. వినయ్ కోసం రాజేశ్-రాధిక వెతుకుతుండగా.. వారితో కలిసి మధు కూడా అతని కోసం వెతికినట్లు నటించాడు.
మరుసటి రోజు అదే ప్రాంతంలోని ఓ ఆటోలో వినయ్ శవం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చేసరికి మధు జారుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు నిజాలు బయటపెట్టాడు.
మాజాలో మందు కలిపి
స్థానిక యూనిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న వినయ్ ను.. ఈనెల 19న ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మధు తన కారులోకి ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి హంటర్రోడ్ మీదుగా న్యూ శాయంపేట జంక్షన్ వరకు వెళ్లి అక్కడ మద్యం బాటిల్తో పాటు మాజా కూల్డ్రింక్ బాటిల్ తీసుకున్నాడు. మాజా కొద్దిగా తాగి అందులో మద్యం కలిపి కారులో ఉన్న వినయ్కు ఇచ్చాడు. అది తాగిన వినయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. ఖర్చీఫ్ తో ముక్కు వద్ద అదిమిపట్టి శ్వాసాడకుండా చేసి చంపేశాడు.
హత్య తర్వాత.. ఇదీ ప్లాన్?:
హత్య తర్వాత శవాన్ని రోడ్డు పక్కన ఉన్న ఓ ఆటోలో మూట గట్టి పారేశాడు. విచారణలో ఈ నిజాలన్నింటిని మధు అంగీకరించాడు. మదు చేతిపై ఉన్న ఆర్ అనే అక్షరానికి అర్థమేంటని పోలీసులు అడగడంతో.. అసలు నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆర్ అంటే రాధిక అని, తన చేతి మీదే కాదు ఛాతి మీద కూడా రాధిక పేరుందని కూడా చెప్పుకొచ్చాడు.
హత్యానంతరం కేసును తప్పుదోవ పట్టించేందుకు బాలుడి జేబులో ఓ లెటర్ కూడా పెట్టాడు. అందులో 'అక్కా మన భర్త నీ కొడుకును చంపమని చెప్పినాడు. ఎందుకంటే నీ కొడుకు చనిపోతే ఆస్తి నా బిడ్డలకు వస్తుంది- ఇట్లు పద్మ' అని రాశాడు. పద్మ అనే మహిళతో వివాహేతర సంబంధాన్ని క్రియేట్ చేసి.. వారే వినయ్ ని చంపారని కట్టుకథ అల్లడానికి మధు ఈ ప్లాన్ వేసినట్లు గుర్తించారు.