‘అవినీతి కేసీఆర్! నీ స్థానం కేరాఫ్ శశికళ’!
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్లో రూ.2400 కోట్ల కుంభకోణం జరిగిందని, రూ. 50కోట్ల మోటార్లు రూ.90కోట్లకు పెంచారని ఆరోపించారు.
మొత్తం 35 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయంటూ కేసీఆర్కు ఆధారాలతో లేఖ రాసినట్లు నాగం తెలిపారు. కేసీఆర్ అవినీతిలో మొనగాడని.. మోడీతో పోల్చుకునే స్థాయి కేసీఆర్కు లేదని స్పష్టం చేశారు. రైతులకు బేడీలు.. ఉగ్రవాదులకే గులాబీ పూలు.. ఇదీ కేసీఆర్ విధానమంటూ తీవ్రంగా విమర్శించారు.
రైతులకు కేంద్రం రూ.700 కోట్లు ఇస్తే ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై గతంలో ఈడీ, విజిలెన్స్, సీవీసీలకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడి అవినీతి జరుగుతుంటే.. మోడీతో ఆయనకు పోలికనా అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్.. అమిత్ షాను అవమానిస్తారా? అని నిలదీశారు. తాము చెప్పింది తప్పయితే తమపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని.. లేదంటే కేసీఆర్ స్థానం కేరాఫ్ శశికళ అవుతుందని నాగం తేల్చి చెప్పారు. తమ జోలికి వస్తే ఖబడ్దార్.. ప్రగతి భవన్లో చర్చకు సిద్ధమైతే కేసీఆర్ అవినీతిని నిరూపించడానికి బీజేపీ సిద్ధమని నాగం స్పష్టం చేశారు.
తెలంగాణకు రక్షణ కావాలంటే రజాకార్లను పెట్టుకుంటారా? ఫఎడరల్ స్ఫూర్తి ఉండకూడదా? అని నిలదీశారు. మతాలు, కులాల పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని నాగం మండిపడ్డారు. అమిత్ షా నాయకత్వంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీదే అధికారమని నాగం ధీమా వ్యక్తం చేశారు.