ఒబామా, టీ మంత్రి మహేందర్ రెడ్డిపై నారాయణ ఫైర్
ఖమ్మం: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన భారత దేశానికి శాపమని సీపీఐ నేత నారాయణ గురువారం మండిపడ్డారు. ఒబామా పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. గురువారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు.
అమెరికా కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులను భారత దేశంలో అమ్ముకునేందుకు ఆయన ఇక్కడికి వస్తున్నారన్నారు. ఈ దేశ సంపదను దోచుకునే కుట్ర కూడా ఇందులో ఉందన్నారు. ఒబామా రాక సందర్భంగా దేశంలో రక్షణ బాధ్యతలను అమెరికా సైన్యం చూసుకోవడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.
మన ప్రధాని అమెరికా వెళ్లినప్పుడు మన సైన్యాన్ని అనుమతించారా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ మతతత్వాన్ని రెచ్చగొట్టడమేగాక భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాడన్నారు. వెంకయ్య నాయుడికి మోడీని పొగిడే పని తప్ప మరొకటి లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి పైన కూడా నారాయణ నిప్పులు చెరిగారు. మహేందర్ రెడ్డి గచ్చిబౌలిలో భూకబ్జాకు పాల్పడ్డారని, మూడు ఎకరాల భూమి ఆక్రమించి ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. స్వైన్ఫ్లూ విస్తరించకుండా యుద్ధప్రాతిపదికన వైద్యులను నియమించాలన్నారు.