నారాయణ కాలేజీలో రచ్చ: విద్యార్థులపై ఎలా.. తలపట్టుకున్న పోలీసులు
నిజాంపేట నారాయణ కాలేజీ విద్యార్థులు అర్ధరాత్రి వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కళాశాల భవనం మూడో అంతస్తులోని ఫర్నీచర్ను, లైట్లను విద్యార్థులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నిజాంపేట నారాయణ కాలేజీ విద్యార్థులు అర్ధరాత్రి వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కళాశాల భవనం మూడో అంతస్తులోని ఫర్నీచర్ను, లైట్లను విద్యార్థులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
నారాయణ కాలేజీలో విద్యార్థుల రచ్చ: పోలీసులనే హడలెత్తించారు.. అసలేమైంది?
కాలేజీ స్టాఫ్ను ఓ గదిలో బంధించి, గేట్లకు తాళం వేశారు. పోలీసులు లోనికి రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు కొంత మేర తగులబెట్టారు. భవనం పై నంచి సింటెక్స్ ట్యాంకులను కిందపడేశారు.
కాలేజీలో తీవ్ర విధ్వంసం సృష్టించి లక్షలాది రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగించిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థుల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.
సాధారణంగా ఇలాంటి విధ్వంసం సృష్టించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. కానీ, విధ్వంసంలో పాల్గొన్న దాదాపు 400 మంది విద్యార్థులు మైనర్లే.
వీరిని అరెస్ట్ చేయాలంటే పలు అడ్డంకులు ఉంటాయి. వీరిని జువైనల్ హోమ్కు తరలించాలి. అదే జరిగితే వారి భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుంది. చదువులు పాడవుతాయి. రిమార్కులు భవిష్యత్ అవకాశాలను దెబ్బతీస్తాయి.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకూ ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని తెలుస్తోంది. పైగా నారాయణ కాలేజీ యాజమాన్యం సైతం ఈ విషయంలో ఫిర్యాదు చేసేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది.
ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలను విద్యార్థులపై తీసుకుంటే, అది ఇతర కాలేజీలపై పడుతుందన్న ఉద్దేశం వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను సాధ్యమైనంత చిన్నదిగా చూసి, సర్దుకోవాలని కళాశాల భావిస్తుండగా, పోలీసులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్తో వదిలేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.