నయీంతో లింక్స్: నేతి విద్యాసాగరరావుపై వేటు?
హైదరాబాద్: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగరరావుపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు పెట్టుకుని భూదందాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనను డిప్యూటీ చైర్మన్ పదవి నుంచి తొలగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
వచ్చే అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నాటికి మండలి డిప్యూటీ చైర్మన్ను మారుస్తారని అంటున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన నేతి విద్యాసాగర్ ప్రస్తుతం రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.
దాదాపు 40 ఏళ్లకుపైగా కాంగ్రెసులో వివిధ హోదాల్లో పనిచేసిన విద్యాసాగర్ 2009లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం 2015లో ముగిసింది. అయితే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చా క కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి తెరాసలో చేరారు.
ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ శాసన మండలి చైర్మన్గా ఎన్నికయ్యే వరకు విద్యాసాగర్ చైర్మన్గా, తదుపరి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరిన ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని టీఆర్ఎస్ రెన్యువల్ చేసి, డిప్యూటీ చైర్మన్ పదవిలో కొనసాగిస్తోంది.
అయితే గ్యాంగ్స్టర్ నయీంతో విద్యాసాగర్కు సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నయీం కేసులో అరెస్టు అయిన నిందితులు తమ వాంగ్మూలంలో ఆ విషయాన్ని నిర్ధారించారు. విద్యాసాగర్ రావుకు నయీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడాన్ని ముఖ్మయంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
తుది విచారణలో నయీం తో విద్యాసాగర్కు సంబంధం లేదని తేలితే ఆయనకు తిరిగి ఏదైనా పదవి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని, అప్పటి వరకు మాత్రం ఆయనను కొనసాగించటం సబబు కాదని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
విద్యాసాగర్ను తప్పిస్తే, ఆ స్థానంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్రావుకూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. పీపుల్స్వార్లో పనిచేసిన ఆయన ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టారు. టీఆర్ఎ్స లో మొదటి నుంచి పనిచేస్తున్నారు.