ఆసక్తికరం: నయీం ఎకె47లు సోహ్రబుద్దీన్ నుంచి సేకరించినవే?
హైదరాబాద్: ఎదురుకాల్పుల్లో మరణించిన గ్యాంగస్టర్ నయీం విషయంలో ఆసక్తికరమైన విషయాల వెలుగు చూస్తున్నాయి. దేశంలోని పలువురు కరుడుగట్టిన నేరస్తులతో పరిచయాలు పెంచుకుని అతను ఆయుధాలు సేకరించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
నయీం భార్య హసీనా, సోదరి సలీమాబేగం, వాచ్మెన్ మతీన్, అతని భార్య కలీమాబేగంలను ఏడురోజులపాటు విచారించిన పోలీసులు పలు కీలక అంశాలను తెలుసుకున్నట్లు సమాచారం. షాద్నగర్లోని నయీం డెన్లో లభ్యమైన రెండు ఏకే-47 తుపాకులు గుజరాత్కు చెందిన సొహ్రాబుద్దీన్ షేక్ అనే గ్యాంగ్స్టర్ నుంచి పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
2005 నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో పోలీసుల చేతిలోసొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృస్టించిన విషయం తెలిసిందే. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ అనంతరం అతని స్వస్థలంలో జరిపిన సోదాల్లో దాదాపు 40 ఏకే 47లు లభ్యమయ్యాయి. దీంతో నయీం నివాసంలో దొరికినవి అక్కడి నుంచి వచ్చి ఉంటాయని పోలీసులు అనుమాస్తున్నారు.
ఆయుధాలను సరఫరా చేసినట్టు భావిస్తున్న హైదరాబాద్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. షాద్నగర్ డెన్లో భారీగా లభ్యమైన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, ఇతర పేలుడు పదార్థాలను నక్సలైటుగా ఉన్నప్పుడే సమకూర్చుకున్నట్లు విచారణలో తేలింది. నయీం కుటుంబసభ్యులు, బినామీలపై 40 ఇండ్లు ఉన్నట్టు నిర్ధారించిన సిట్ అధికారులు ఇప్పటికే 31 ఇండ్లను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా ఇండ్లను రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
నయీం వ్యవహారంలో ఇప్పటివరకు 1500 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సిట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే రెండు హత్యలు వెలుగులోకి రాగా, తాజాగా మరో మూడు హత్యలు బయటపడ్డాయి. తనకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారనే అనుమానంతో తన అనుచరులు భువనగిరి, నల్లగొండకు చెందిన జానీ బాషా, ఆరీఫ్, శ్రీనివాస్ను హత్య చేసినట్టు నయీం భార్య విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
రెండు రోజుల కస్టడీకి ఫయీం, సాజిద్
నయీం ప్రధాన అనుచరుడు ఫయీం, అతని భార్య సాజిద్ షాహీన్ను రెండురోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అలాగే సాజిద్ షాహీన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, తదితర ప్రాంతాల్లో భారీగా కొనుగోలు చేసిన ఆస్తులపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలా ఉండగా ఫర్హానా, అఫ్సాల కస్టడీ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
భువనగిరి కోర్టుకు పాశం శ్రీను
గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీసులు బుధవారం పీటీ వారెంట్పై నల్లగొండ జిల్లా భువనగిరి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎన్ రాధిక ఎదుట బుధవారం హాజరుపరిచారు. ఆ తర్వాత అతన్ని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఎన్నారై డోగిపర్తి శ్రీధర్ను బెదిరించడం, ఇతర కేసుల్లో పాశం శ్రీనుపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో అతను పోలీసులకు లొంగిపోయాడు.